ప్రజాస్వామ్య దేశంలో కలాలకు సంకెళ్ళు వేసి నిజాలను దాచాలని ప్రయత్నిస్తే ప్రభుత్వాలకు పునాదులు ఉండవని మూసి టివి ఎడిటర్ పిట్టల శ్రీశైలం తెలిపారు. మావోయిస్టుల కొరియర్‌గా ముద్రవేసి ఇటీవల పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.

వారం రోజుల నుంచి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న శ్రీశైలం శుక్రవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత 20సంవత్సరాలకుపైగా తాను జర్నలిస్టుగా, తెలంగాణ జర్నలిస్టు ల ఫోరం కన్వీనర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో పలు న్యాయమైన సమస్యలపై పోరాటాలు చేశామన్నారు. గతంలో మావోయిస్టు అగ్రనేత సుదర్శన్ మరికొంతమంది నాయకులతో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసినట్లు చెప్పారు.

ఇటీవల టిఆర్ఎస్ నేత కేసిఆర్ నిజాంపై మాట్లాడిన పలు అంశాలపై తెలంగాణాకు సంబంధించి కొంతమంది పార్టీ నేతలతో, మావోయిస్టు అగ్రనేతలతో ఇంటర్వ్యూలు నిర్వహించాలనే ఉద్దేశంతో గత కొద్దిరోజులుగా వారిని కలిసే ప్రయత్నాలు చేశామన్నారు. ఇటీవల అటువైపు నుంచి ఇంటర్వ్యూకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో హైదరాబాద్ నుంచి ఈనెల నాలుగవ తేదీన కందుకూరుకు బయలుదేరి వెళ్ళామన్నారు. మావోయిస్టు నేతల దగ్గరకు తీసుకెళ్ళే కొరియర్ కందుకూరు ఆర్టీసి బస్టాండ్‌లో ఉంటాడని , అతని వద్దకు వెళ్ళి రాజు మీరేనా అని అడిగితే ఆ వ్యక్తి చేరాల్సిన గమ్యానికి తీసుకెళతాడని చెప్పి ఉండడంతో తాను నేరుగా కందుకూరు బస్టాండ్‌కు వెళ్ళినట్లు శ్రీశైలం తెలిపారు. బస్‌స్టాండ్‌లో తనే రాజునని తలూపిన వ్యక్తితో కొంత దూరం వెళ్ళాక ఒక్కసారిగా 10మంది మఫ్టీలో ఉన్న పోలీసులు తుపాకులు చూపిస్తూ చుట్టుముట్టి బలవంతంగా టాటా సుమోలో ఎక్కించుకుని వెళ్ళారన్నారు.

కళ్ళకు గంతలు కట్టి సుమారు 10గంటల పాటు వివిధ ప్రాంతాల్లో తిప్పారన్నారు. అదేరోజు రాత్రి హైదరాబాద్‌కు తీసుకెళ్ళి తనకు సాగర్ సాంబశివుడితో సంబంధాలు ఉన్నాయని అభియోగం మోపి నిర్బంధించారన్నారు. మావోయిస్టులకు కొరియర్‌గా పనిచేస్తున్నట్లు ఒప్పుకోమని పోలీసులు చిత్రహింసలు పెట్టారని చెప్పారు. తన వద్ద సుమారు వంద తెల్లకాగితాలమీద సంతకాలు పెట్టించుకున్నారని శ్రీశైలం తెలిపారు. తాను జర్నలిస్టునని , మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవని, కేవలం ఇంటర్వ్యూ కోసం వెళుతున్నట్లు చెప్పినా వారు వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తపరిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయన్నారు. ప్రజాసంఘాలు, మేథావులు, రాజకీయ పార్టీలు వీటిని ఖండించాలని కోరారు.

సౌజన్యం:
ఆంధ్రజ్యోతి
డిసెంబరు 14,2007

ఒక్క అభిప్రాయం

  1. umamaheswara rao c 04 జనవరి 2008 , 11:28 pm

    The police not adhering to constitution and just reflecting the intention of the rulers [ who surely try to distort democracy to their convenience]; should not continue to be the culture of the modern era. Perceiving the compulsions the police is subjected to, the judiciary should act without any delay and try the validity of the case immediately so that any free thinker is not traumatized.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)