ఎంతో చెప్పాలని ఉండే
కాని కొంచం కూడా చెప్పలేక పోయాను !
చాలా రాయాలని ఉండే
కాని ఏమీ రాయలేక పోయాను !
నా మాట విని
కడుపులో దేవినట్లు
ముఖం పెట్టాడు !
నా రాత చూసి
కుక్కలు చించిన విస్తరిలా ఉందని
విసిరికొట్టాడు !
నా మాటని
వాడు పలికే తీరులోనే
పలకాలంట ?
నా రాతని
వాడు నిర్ధేశించిన వ్యాకరణంలోనే
వ్రాయాలంట ?
ఆ మాట తీరులో - ఆ వ్యాకరణంలో
దాగున్న అసలు కుట్ర తెలియక….
అయ్యోరికి జబ్బు చేసిద్దేమోనని
నా నోరు మూసేసుకోని
మూగోడినయ్యాను !
అయ్యోరికి కోపం వచ్చిద్దేమోనని
నా రాత చెరిపేసుకుని
తలలేనోడ్నయ్యాను !
యింతేనా…?
నా ఆజానుబాహు దేహం చూసి
కొండలా ఉన్నానని
ఎద్దేవా చేశాడు !
నా దిట్టమైన కండలు చూసి
ఏనుగులా ఉన్నానని
న్యక్కారం చేశాడు !
నన్ను కొండను చేసి
నా పైన ఆడు తపస్సు చేసుకున్నాడు !
నన్ను ఏనుగుని చేసి
ఆడికి అంబారిగా మార్చుకున్నాడు !
అయితే…!
ఆడికి తెలియదు !
కొండ క్రింద మంట ఉంటుందని
ఆ మంటకు
కొండ బ్రద్దలవుతుందని !
ఆడికి తెలియదు !
ఏనుగు కోపిష్టిదని
కోపమొస్తే
అంబారెక్కినోడిని లాగి విసిరేసిద్దని !
హేయ్………………………..!
ఇప్పుడు నేను
బ్రద్దలయి కొండన్నుండొచ్చిన
క్రొత్త దావానలాన్ని!
ఇప్పుడు నేను
రోషమొచ్చి ఘీంకరిస్తున్న
రోష గజాన్ని!
నేను బ్రద్దలయినప్పుడే
నా మీద కూర్చున్నోడు
బ్రద్దలయ్యాడు !
నా మొదటి ఘీంకారంతోనే
నా పైన సవారి చేస్తున్నోడు
క్రిందపడి హహకారాలు చేశాడు !
ఇప్పుడు నేను
నన్నులా కాకుండ
మన్నులా చేసినోడిని
సాగనంపుతాను !
ఇప్పుడు నేను
నా చేతులతోటే
నా రాతను తుడిపించేసినోడిని
తరిమికొడతాను !
ఇప్పుడు నువ్వూ – నేనూ, మనం
మన భాషలో మాట్లాడుకుందాం !
ఇప్పుడు మనం
మన భాషలో వ్రాసుకుందాం !
ఇప్పుడు మనం
మనదైన ఓ నూతన వ్యవస్థను
నిర్మిద్దాం !
9 అక్టోబర్, 2007, లండన్.
(జిలుకర శ్రీనివాస్, పసునూరి రవీందర్ ల ‘నిర్ధేశాత్మక వ్యాకరణం - ప్రాదేశిక భాషలు’ వ్యాస ప్రేరణతో)
చాంధస భావాల మీద కవితాయుధంతో
మెరుపు దాడి ప్రకటించిన
కవి సాంబయ్య గారికి
అభినందనలు.
ఎన్నో సంవత్సరాలుగా
అగ్రవర్ణాలు
నిమ్నజాతి భాషా,సంస్కృతుల మీద
చేస్తున్న అణిచివేతను
ముక్కు సూటిగా ప్రశ్నించిన తీరు అద్భుతం.
ఇప్పటి వరకు
పుస్తకాలు చదివి మాత్రమే
స్పందించి రాసిన కవిత్వం చూసాము.
కానీ ఇలా
ఒక వ్యాసం చదివి స్పందించి
కవిత్వమై ప్రవహించడం
కొత్తగా ఉంది.
చక్కని కవితకు మరోసారి
శుభాకాంక్షలు.
అద్భుతం. ఆత్మగౌరవం లేకుండా ఏదీ సాధించలేం. ఖన్నా గారన్నట్టు ముక్కుసూటిగా ప్రశ్నించారు. ధన్యవాదాలు.
ప్రతీ వాక్యంలోనూ మన జీవితం. ఈ కవిత చదువుతూ వుంటే నేనే మంటయి కాల్చేసినట్టు, ఏనుగై విసిరేసినట్టు, నన్ను నేను నిర్మించుకున్నంత ప్రోత్సాహం కలిగింది. ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములమవుదాం. కవి గారికి, రచయితలకు నా ధన్యవాదాలు.
సాంబయ్య గారు మీ కవిత చాల బాగుంది.తరతరాలుగా దలితులను విద్యకు దూరంగా వుంచడమే కాక,వీరు నేర్చిన దొంగల భాషను దలితులకు అంటగట్టడమూ,దలితుల ప్రతిభను వీల్లు ఏర్పరిచిన ప్రమాణాల కింద పాతిపెట్టడం జరిగింది.కానీ నేడు దలితుల ఆత్మగౌరవ ఫోరాటాలు,తమదైన ప్రత్యేక సాహిత్యం హర్షించదగినవి.