-డా.దార్ల వెంకటేశ్వరరావు

1.0 ప్రస్తావన:
తెలుగులో స్త్రీవాదం వచ్చిన తరువాత, దళిత , ముస్లిం మైనారిటీ వాదంలోనూ స్త్రీ లు తమ సమస్యలను కవిత్వీకరిస్తున్నారు. అంతకు ముందు పురుషులే స్త్రీ సమస్యలను కొంతవరకూ స్పర్శిస్తూ కవిత్వం రాశారు. అయితే స్త్రీలు రాసిన కవిత్వంలో మరింత బలంగా ముస్లిం స్త్రీ సమస్యలు అభివ్యక్తయ్యాయి.

ముస్లిం స్త్రీ సమస్యలను షాజహానా, మున్వీరునిసా, మహేజబీన్, షహనాజ్ ఫాతిమా మొదలైన వాళ్ళు స్త్రీవాద దృక్పథంతో కవిత్వీకరిస్తున్నారు. షాజహానా రాసిన “నఖాబ్” కవితా సంకలనం ముస్లిం స్త్రీ వాదానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతకు ముందు వచ్చిన ‘’జల్ జలా'’ కవితా సంకలనంలో కూడా స్త్రీ వాద సమస్యలను వర్ణిస్తూ పురుషులు కవిత్వం రాశారు. ఖాదర్ మొహియుద్దిన్ ‘’పుట్టుమచ్చ'’లో, గుజరాత్ సంఘటనల తరువాత ‘’గుజరాత్ గాయం'’, ‘’ఆజా'’, ముస్లింల సాహిత్య ప్రత్యేక సంకలనం'’ ముల్కి'’, ‘’అలావా'’ కవితా సంకలనం, స్కై బాబా రాసిన ‘’జగన్కీరాత్'’, ఖాజా ‘’ఫత్వా'’ మొదలైన వాటిలో ముస్లిం స్త్రీ వాదం కనిపిస్తుంది.

ఇంటిలో స్త్రీ పురుషుల మధ్య కనిపించే వివక్ష ఇతర స్త్రీలకున్నట్లే ముస్లిం స్త్రీలలోనూ ఉంది. కానీ, ఉన్నత విద్యనభ్యసించనివ్వకపోవడం, నిర్ణయాధికారం లేకపోవడం మొదలైన వాటి విషయంలో ముస్లిం స్త్రీలు మరింత వివక్షకు గురవుతున్నారు. బయటకు కనిపించే బురఖా, ఆ బురఖా వెనుక ఎన్నో నిర్భందాలు, బహు భార్యత్వ సమస్య, బహు సంతానోత్పత్తి కోసం అనుభవించే లైంగిక వివక్ష, భర్త చనిపోతే స్త్రీ పునర్వివాహం పట్ల తలెత్తుతున్నఅనేక పరిణామాలు మొదలైన సమస్యలు ముస్లిం స్త్రీ వాదంలో కనిపిస్తున్నాయి. అంతే కాకుండా, పురుషాధిపత్యం, కుటుంబ హింస, ఆర్థిక, సాంస్కృతిక విద్యా కారణాల వల్ల చాలామంది విడాకుల కోసం “తలాఖ్” చెబుతున్నారు. ఆర్థిక, ఉద్యోగ కారణాల వల్ల పరదే్శాలకు వలస పోయిన తరువాత స్త్రీలు పొందే కష్టాలు, బాలికలను ముసలి వాళ్ళకిచ్చి వివాహం చేసే పద్ధతి, దాని వెనుక స్త్రీ ఆంతరంగిక మనస్తత్వం వంటివన్నీ ముస్లిం స్త్రీ వాదంలో కవయిత్రులు వర్ణిస్తున్నారు. దీని తెలుసుకొనే ముందు ముస్లిం మైనారిటీ సాహిత్యం అంటే ఏమిటో సంక్షిప్తంగానైనా తెలుసుకొంటే బాగుంటుంది.

1.1 ముస్లిం మైనారిటీ వాదం:
తెలుగు సాహిత్యంలో “మైనారిటీ వాదం” అనే పేరు వినిపిస్తుంది. Minority అనగా “అల్ప సంఖ్యాకులు” అని అర్థం. భారతీయ జనాభా లెక్కలప్రకారం హిందువుల తర్వాత స్థానంలో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు మొదలైన వారు సంఖ్యాపరమైన క్రమంలోకనిపిస్తున్నారు. హిందువులు తప్ప మిగిలిన వారంతా ఇంచుమించు అల్పసంఖ్యాకులే. అయినప్పటికీ అల్ప సంఖ్యాకులైన ముస్లింలు తమ కష్టనష్టాలను అభివ్యక్తి కరించే సాహిత్యాన్ని ‘మైనారిటీ వాదం’ అంటున్నారు. తెలుగు సాహిత్యంలో ‘మైనారిటీ వాదం’ అనేది ఒక పారిభాషిక పదంగా మారింది. ప్రపంచ వ్యాప్త పరిస్థితులను బట్టి తమ సమస్యలలోప్రత్యేకత ఉందని అల్ప సంఖ్యాక వర్గం కావడం వల్ల అభద్రత భావం నెలకొందని భావిస్తున్న ముస్లింల మనోభావాలను ప్రతిఫలిస్తు వస్తున్న సాహిత్యమే మైనారిటీ వాద సాహిత్యం. దీన్ని “మైనారిటీ వాద సాహిత్యం”,” ముస్లిం సాహిత్య వాదం”, “మైనారిటీవాదం” వంటి మొదలైన పేర్లతో పిలుస్తున్నారు. ఈ స్వరూప స్వభావాలను సాధారణీకరించి తెలుగు సాహిత్యంలో ముస్లింల ప్రత్యేక అనుభవాలవ్యక్తీకరణను గుర్తించ గలిగే విధంగా దీనిని “ముస్లిం మైనారిటీ వాదం” అని పిలవడం సమజసంగా ఉంటుంది.

1.2 ముస్లిం మైనారిటీ వాదం - నిర్వచనం:
1) ముస్లిం మనోభావాలను శక్తి వంతంగా “పుట్టు మచ్చ” కవిత ద్వారా వ్యక్తీకరించిన ఖాద్దర్ మొహియిద్దిన్గారి ప్రకారం - “ముస్లిం వాదం అంటే ముఖ్యంగా ముస్లిం ఆలోచనల చట్టం అన్నారు. దీన్ని మరింత వివరిస్తూ “ముస్లిం తత్త్వం, ముస్లిం తాత్త్విక దృక్పథం,ముస్లింలు గతాన్ని ఎలా చూడాలి ?తమ భవిష్యత్ ను ఎలా నిర్మించుకోవాలి? ఈ రెండింటికి సబంధించిన వివిధ అంశాల పట్ల ఎటువంటి వైఖరిని కలిగి ఉండాలి? వీటిని వివరించేదే ముస్లిం తాత్త్విక దృక్పథం. ఈదృక్పథాన్ని సాహిత్య కళారంగాల్లో ఎలా ప్రతిఫలింపజేయాలో వివరించేదేముస్లిం సాహిత్య దృక్పథం” అని ముస్లిం సంస్కృతి కవిత్వం”అలావా “కు రాసిన ముందుమాట (సూఫీతత్వమే సరైనా మార్గం..)లోఖాద్దర్ మొహియిద్దిన్ అన్నారు. ఈయనే ముస్లిం మైనారిటీ వాదాన్ని ఇంకొంచెం లోతుగా వివరిస్తూ “ముస్లిం వాదమంటే ఒక ధార్మిక సముదాయంగా తన గతిని స్థితిని తను దర్శించుకునే చైతన్యం. తనవైన ప్రతీకలు చిహ్నల ద్వారా తనదైన ఒక అభివ్యక్తి అంతేకాదు . ముస్లిం వాదం అంటే భారతీయ ముస్లిం సంస్కృతిక విలువల పట్ల , ఆ మాటకి వస్తే మొత్తం ప్రాశ్చ ప్రపంచ సాంస్కృతిక విలువల పట్ల, సార్వజనీయమైన మానవత విలువల పట్ల ఒక నిబద్ధత, ఒక జాగురూకత . వాటిని పరిరక్షించుకునే ఒక ప్రయత్నం. వాటి అభివృద్ధి ని కాంక్షించే ఒక సంకల్పం. తెలుగు ద్వారా భారతీయ సాహిత్యాన్నికి తద్వారా మానవ నాగరీకతకి అందుతున్న అపూర్వమైన ఒక అదనపు విలువ ముస్లింవాదం.
ముస్లింవాదం తనలోనే తానొక ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ముస్లిం వాదం తనకోసం తనదైన పద్ధతిలొ తన ఉనికిని లోకాన్నికి చాటి చెప్పేందుకు సృష్టించిన సృజనాత్మక నినాదం” అని అన్నారు.

2)ముస్లిం మైనారిటీ వాదం గురించి కొన్ని వ్యాసాలు రాసిన ప్రముఖ విమర్శకురాలు ముదిగంటి సుజాతరెడ్డి గారి అభిప్రాయంలో “మైనారిటీ వాదం అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు మొదలైన మతపరంగా అల్పసంఖ్యలో ఉన్నవారందరూ ఉండాలి. కాని వారు ఎవ్వరూ ఈ అభివ్యక్తిలో లేరు. క్రిస్టియన్ ల వేదన కొంత వరకు దళిత వాద కవిత్వంలో ప్రకటితమవుతుంది. ఇంక కేవలం ముస్లింల వేదన ప్రకటించేదే మైనారిటీ వాదంగా కనిపిస్తుంది. భారతదేశపు విశాలమైన దేశీయ సమాజంలో భాగంగా గుర్తింపబడక పోవడం అనే ఆవేదన అందరిచేత కాకున్న కొందరి లెక్కల్లో దేశ ద్రోహులుగా తప్పుడు ప్రచారం చేయబడుతున్న బాధ మైనారిటీ వాదంలోని ముస్లిం సాహిత్యంలో వ్యక్తమవుతున్నది. ఇది కేవలం కాషాయమూకలకు వ్యతిరేకంగాను, ఫ్యాసిస్ట్ ధోరణులకు వ్యతిరేకంగాను లేస్తున్న సాహిత్యోద్యమం కాదు. కాని మతోన్మాద శక్తులు చూపే వివిక్ష ,అంటగట్టే దేశ ద్రోహత్వం , జరిపే హింసకు కుమిలిపోతు బయటకు వ్యక్తం చేసే వేదన మైనారిటీ కవిత్వంలో కనిపిస్తుంది.” అని ఈ మైనారిటీ సాహిత్య స్వభావం గురించి వివరించారు. ( “ముల్కి” - ముస్లిం సాహిత్య సంకలనం, 2005: 93)

3) ముస్లిం మైనారిటీ వాదాన్ని ఉద్యమప్రాయంగా ముందుకు తీసుకువెళితున్న స్కై బాబా అభిప్రాయంలో - “భారతదేశంలోని ముస్లింలు ప్రత్యేక పరిస్థితుల రీత్యా ముస్లిం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విషయాల్ని గురించి ముస్లిం వాదం మాట్లాడుతుంది. మతం వ్యక్తిగతం అనే స్పృహతో మతం జోలికి ముస్లింవాదం వెళ్లదు. కాని, ముస్లింల జీవన మార్గాని కి ప్రత్యక్షంగా, పరోక్షంగా అడ్డంకులుగా నిలుస్తున్న అంశాల పట్ల స్పందిస్తుంది. ముస్లింలను అణిచి వేస్తున్న మూల శత్రువుతో పోరాడుతునే అంతర్గత వైరుధ్యాలను వదలకుండా బాహ్య అంతర రెండు పోరాటాలు చేయడం ముస్లింవాదం ప్రత్యేకత. హిదుత్వ దాష్టీకాన్ని ప్రశిస్తూనే అంతర్గతంగా ముస్లిం స్త్రీల గురించి, దూదేకుల గురించి ముస్లింలోని ఛాందసత్వం గురించి, ముస్లిం సమాజంలో జరగవలసిన సంస్కరణ ల గురించి, తమ మూలాల వెతుకులాట గురించి ఎంతో సాహిత్యాన్ని సృష్టించటం ఆ సాహిత్య ప్రత్యేకత “అని అన్నారు. ( “అలావా ” ముస్లిం సంస్కృతి కవిత్వం, 2006 :18)

మొత్తం మీద ముస్లిం మైనారిటీవాద సాహిత్యం ఒకవైపు స్వీయమతంలోని మూఢాచారాలను ఖండిస్తూ మరొక వైపు మాతృదేశంలోతమ అస్తిత్వాన్ని నిరూపించుకుంటూ అగ్ర వర్గానికి కింది వర్గానికి మధ్య నలిగిపోతూ తాము ఏ స్థితిలో ఉన్నారో తెలియజేస్తూ రాసున్న సాహిత్యం “ముస్లిం మైనారిటీ వాద సాహిత్యం” అని నిర్వచించుకోవచ్చు.

1.3 ముస్లిం మైనారిటీ కవిత్వం - స్త్రీవాద దృక్పథం:
ఈ పత్రంలో ముందే ప్రస్తావించినట్లు వివక్షను ఆధారంగా చేసుకొని ముస్లిం స్త్రీవాదం వచ్చింది. మతాన్ని ఆధారంగా చేసుకొనే ఇంచుమించు అన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయినప్పటికి ఆయా సమస్యలను బట్టి కింది విధంగా ముస్లిం స్త్రీవాదాన్ని వివరించుకునే అవకాశం ఉంది.

1.3.1 మతాంతరీకరణ - భాషా సమస్య:
వివిధ పాలన, సాంఘిక, మతకారణాల వల్ల కొన్ని సామాజిక వర్ణాల వాళ్ళు ముస్లింలుగా మతాంతరీకరణ చెందడం వల్ల భాష, ఆచార వ్యవహారాల్లో కలిగే ఇబ్బందులను కూడా ముస్లిం స్త్రీలు కవిత్వీకరిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని కవితా ఖండికలను చూస్తే ముస్లిం స్త్రీ వాదం ఎలా ఉందో తెలుస్తుంది. ముస్లిం స్త్రీ పరంగా వారి మనోభావాలను వర్ణించడంలో చేయి తిరిగిన రచయిత్రి షాజాహానా. ఆమె “లద్దాఫ్ని ” పేరుతో రాసిన కవితలో ముస్లింలలో ‘లద్దాఫ్ ‘ స్త్రీ మానసిక జీవితాన్ని చిత్రించారు. వచ్చీ రాని ఉర్దూ పదాలతో మాట్లాడుతుంటే ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని అధిగమించడం కోసం ఉర్దూ నేర్చుకోవాలనే వారి ప్రయత్నం, ఆ భాష రాక, తన మాతృ భాషలోనే మాట్లడితే వచ్చే నష్టమేమిటనే ప్రతిఘటన స్వరాన్ని కూడా వినిపించగలిగారు కవయిత్రి. ‘భాష ‘ భావాభివ్యక్తికి బలమైన వాహిక మాత్రమే తప్ప. ఫలానా భాషలోనే మాట్లాడాలనే నియమం లేదని ఒక శాస్త్రీయమైన ఆలోచనను ప్రతిఘటన స్వరంతో ప్రతిధ్వనిస్తూ…
“వచ్చోరాదో - నా ఉర్దూ పరిజ్ఞానం మీద
వాళ్ళ కుతూహల ప్రావీణ్య ప్రదర్శన జరిగి”నప్పుడు -
“తెగించి - బయటకు రాలేని మొహమాటపు నీటి చుక్కలు
కంటె కొనల్లో ఇరుక్కొని అచ్చం నాలాగే అల్లాడతాయ”ని వర్ణించారు. ముస్లిం స్త్రీ ఈ పరిస్థితిని ఎదుర్కొనే స్థితిని వర్ణిస్తూ -
“వాళ్ళ ఉరుదూ జరీ చీరల సమూహాల గల గలల మెరుపుల ముందు
నా గొంతు కాటన్ చీరై బిక్కు బిక్కుమంటూ
ఒంటరిగా ముడుచుకుంటుంది.” అని ఆ పరిస్థితిని జరీ చీరల మధ్య కాటన్ చీర తెల్లబోయిన దృశ్యాలతో పోల్చారు కవయిత్రి. జరీ చీరలను ముస్లింల లోని ఉన్నత వర్గానికి, కాటం చీరను కింది వర్గానికి ప్రతీక చేసి వర్ణించారు కవయిత్రి. దీని ద్వారా ముస్లింలలోని వర్గ సమస్యను కూడా చెప్పినట్లయింది. అవమానాల నుండి ఆత్మ గౌరవాన్ని ప్రదర్శిస్తూ -
” నీ దూదేకుల తనాన్ని షోహర్ ఆపాదించుకోనప్పుడు
అస్లీ ముస్లిం ముద్రని మాత్రం నేనెందుకు భరించాలి?” అంటుంది కవయిత్రి “లదాహీ రహూంగీ” అంటూ కవితను ముగించారు.

1.3.2 సంతానోత్పత్తి - లైంగిక హింస:
ముస్లిం స్త్రీ అనగానే చాలా మందిలో వినిపించే మాట అనేకమందికి జన్మనివ్వడానికి పుట్టిన స్త్రీ! ఈ సమస్యను శక్తి వంతంగా కవిత్వీకరించారు ‘షహనాజీ పాతిమా’!
” ఓపిగ్గా అసంఖ్యాక వారసుల్నిచ్చే
సంతానోత్పత్తి కర్మాగారం

అనాదిగా ఆధారపడ్డం అలవాటు చేయబడిన
స్వయం ప్రతిపత్తి లేని పరాధీన ” గా ముస్లిం స్త్రీ బతుకుని వెళ్ళదీస్తున్న దృశ్యాన్ని అభివర్ణించారు కవయిత్రి . ‘ఖబర్దార్’ అనే కవితలో ముస్లిం స్త్రీ అనుభవిస్తున్న లైంగిక హింసను షాజహానా ఇలా వర్ణించారు.
” మీ సుఖంకోసం
ప్రాణం చీల్చుకు పన్నెండు మందిని కనమనండి
లేకపోతే నరకం
ఇప్పుడు అనుభవిస్తున్నదే పక్కా స్వర్గం” ఇలా వర్ణించి వదిలేయలేదు కవితను. తిరుగుబాటు తత్వాన్ని పేరేపిస్తూ ఇలా అంటారు.
” మమ్మల్ని మౌన మాంసాలుగా
ఉత్పత్తి యంత్రాలుగా బతకమన్న మీ సంప్రదాయానికో సలాం”
ఇక్కడ షాజహానా కవితలో ముస్లిం స్త్రీ వేదనను వర్ణించటమే కాకుండా సమస్య పరిష్కారానికి మార్గాన్ని కూడా చూపిస్తున్నారు. సంప్రదాయంలో ఉన్నంత కాలం స్త్రీకి విముక్తి లేదనేది ముస్లిం స్త్రీలు గుర్తించాలని కవయిత్రి భావిస్తున్నారు.

1.3.3 వివాహం -బహు భార్యత్వం:
ముస్లింలకు పవిత్ర గ్రంథంగా భావించే ఖురాన్ లో ముస్లిం వివాహ వ్యవస్థ గురించిఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే బహూ భార్యాత్వాన్ని అంగీకరించ వచ్చునని స్పష్టంగానే ఉంది. దీన్ని వక్రీకరిస్తూ, మత పెద్దల అండ దండలతో స్త్రీ మనోభి ప్రాయాలను విలువనివ్వకుండా జరుగుతున్న వివాహం గురించి, ఆ వివాహాల వెనుక ఉండే దయనీయ గాథల గురించి కూడా కవిత్వం వచ్చింది.
” నేనొక అరబ్బు కామ వాంఛకు
బలైన బొమ్మను
…..
పరదేశానికి అమ్ముడైన
అంగడి బొమ్మను నేను
….
కన్న వాళ్ళ అసహాయితకు
కటిక పేదరికానికి
బలిపీఠం ఎక్కుతున్న వాళ్ళం
మేము కేవలం బొమ్మలం ” ఒకవైపు పేదరికం, మరొక వైపు మూఢత్వం చేసే పెత్తనం. ఈ రెండింటి మధ్య బొమ్మల్లా మారిపోతున్న స్త్రీల గురించి మున్వీరున్నీసా రాసిన “గుడియా” కవిత గొప్ప నిదర్శనం!

1.4 ముగింపు:
ముస్లిం స్త్రీవాదం గురించి మాట్లాడుతూ డా// ఎండ్లూరి సుధాకర్ ఇలా అన్నారు. “ముస్లిం స్త్రీవాద కవిత్వం అంటే ముస్లిం స్త్రీలు రాసిందే అవుతుంది. ఇక్కడ సానుభూతికి తావులేదు. ముస్లిం స్త్రీ పుట్టుక ముస్లిం స్త్రీ ఉనికిని నిర్ధారిస్తుంది.” (ముల్కీ 2005 - 95) ఈ అభిప్రాయం ప్రకారం చూస్తే ముస్లిం స్త్రీవాదం గురించి ముస్లిం స్త్రీల రచనలనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇతరుల రచనలను తీసుకున్న ముస్లిం స్త్రీలు రాసినదానికున్నంత ప్రాధాన్యతను ఇవ్వవలసిన అవసరం లేదని గుర్తించాలి. అంతే తప్ప ఇతరులు రాయకూడదని కాదు. ఈ పత్రంలో ముస్లిం స్త్రీలు రాసిన కవిత్వాన్నే ప్రధానంగా తీసుకొని విశ్లేషించడం జరిగింది. ముస్లిం స్త్రీలు రాసిన కవిత్వంలో వారి బాధలు వెల్లడవుతున్నాయి. ఇతర మతాలు, వర్ణాలలో కంటే ముస్లిం స్త్రీ ఇస్లాం మతంలో మరింత పీడనకు గురవుతుందని ముస్లిం స్త్రీవాదం వల్ల స్పష్టమవుతుంది. వస్తువులో వచ్చిన నవ్యత శిల్పంలో కూడా ప్రవేశించి తెలుగు సాహిత్యానికి మరింత సొగసుని అందించిందని చెప్పుకోవచ్చు. ముస్లిం సాహిత్యం రాస్తున్న కొద్దిమందిలో స్త్రీవాద దృక్పథంతో రాస్తున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలోను శక్తివంతంగా రాసే కవయిత్రిగా నిలుస్తున్నారు. ఈ విధంగా విశ్లేషించుకున్నపుడు ముస్లిం స్త్రీవాదం షాజహానా చుట్టూ తిరుగుతుందని చెప్పవచ్చు. ముస్లిం సమస్యలు మరిన్ని బయటకు రావాలంటే ముస్లిం మహిళలు మరింత మంది చదువుకోవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఇస్లాం మతంలోని కొన్ని లోపాలు స్త్రీ పాలిట శాపాలుగా వక్రీకరించని పరిస్థితి నెలకొంటుంది.
ఆధార గ్రంథాలు:

1. నఖాబ్ (ముస్లిం స్త్రీ కవిత్వం) షాజహానా, నసాల్ కితాబ్ ఘర్ ప్రచురణ, హైదరాబాద్. ఫిబ్రవరి, 2005
2. ముల్కీ (ముస్లిం సాహిత్య సంకలనం) సంపాదకులు: వేముల ఎల్లయ్య, స్కైబాబ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్. జూలై, 2005.
3. అలావా (ముస్లిం సంస్కృతి కవిత్వం) సంపాదకులు: షాజహానా, స్కైబాబ, నసాల్ కితాబ్ ఘర్ ప్రచురణ, హైదరాబాద్. జూలై, 2006.

13 అభిప్రాయాలు

  1. rapaka venu 03 నవంబర్ 2007 , 1:50 am

    దార్ల గారి వ్యాసం బావుంది. ముస్మం మైనారిటీవాదాన్ని నిర్వచించే ప్రయత్నం అభినందనీయం. అకడమిగ్గా ఉండడం అదనపు విలువ.
    వేణు రాపాక.

  2. vrdarla 05 నవంబర్ 2007 , 3:11 am

    వేణు గారు!
    మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

  3. Rakesh Telangaan 05 నవంబర్ 2007 , 6:09 am

    భారతదేశంలో ముస్లింలపట్ల హిందువుల ప్రవర్తనా, దాని కారణాలగురించి ఆర్. అఖిలేశ్వరి గారి చక్కటి రచన ఈ మధ్యనే ప్రచురితమైంది.
    (చివరన లింకు ఇచ్చాను. Courtesy: Andhrajyothy Daily)

    quotable quote:
    “శోచనీయమైన విషయం ఏమిటంటే మా హిందువులం ఇప్పటికీ భారతీయ ముస్లింలను క్షమించలేకున్నాము - వారి సహచరమతస్థులు దేశవిభజనకు ఆందోళనచేసి పాకిస్థాన్ను సాధించుకున్న కారణంగా.”

    “భారత్ లోనే ఉండిపోయిన ముస్లింలు, ఈ దేశంలోనే తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే భరోసాతో ఇక్కడ ఉండి పోయారనేభావన మా మనస్సుల్లోకి ఒక్కసారికూడా ప్రవేశించదు.”

    లింకు:
    http://www.andhrajyothy.com/archives/archive-2007-10-29/editshow.asp?qry=/2007/oct/28edit3

  4. ramadasinala 06 నవంబర్ 2007 , 2:25 am

    దార్ల గాగి వ్యాసమ్ చాల బాగుంది .ముందుముందు ఇలాంటి వ్యాసలాను వెలుగులొనికి తీసుకువస్తారాని నిదరపొతున్న ప్రజనీకనీలెపుతారానీ అశిసుతు…..రామదాసు సిరిపురము (కెజి),వెరా
    (మం),ఖమ్మ

  5. mamatha 06 నవంబర్ 2007 , 2:44 am

    చాల బాగుంది.మీ వ్యాసమ్ .

  6. జాన్ హైడ్ కనుమూరి 06 నవంబర్ 2007 , 7:15 am

    దార్లగారూ మీవ్యాసం బాగుంది.

    సంతులనమైన వివరణ, అవగాహన అనిపించింది.

    నేను రాసిన “హసీనా”
    నా లాంటివారు రాసినవి కూడా పరిగణలోకి తీసుకొంటే బాగుండేదేమో?

    అభినందనలు

  7. vrdarla 06 నవంబర్ 2007 , 8:32 am

    అభిప్రాయాలు రాస్తున్న వారికందరికీ ధన్యవాదాలు. భావజాలం, వ్యాసవిషయం మొదలైన వాటి పై చర్చిస్తే మరింత సంతోషిస్తాను.
    ఇక,
    అయ్యా!
    జాన్ హైడ్ కనుమూరి గారు నమస్తే… ! ముందుగా మీ అభినందనలకు నా ధన్యవాదాలు. నిజమే మీ హసీనా చదివాను. ముస్లి స్త్రీ జీవిత కోణాన్ని చూపడంలో హసీనా కవితా సంకలనంలో కొత్త పార్శ్వ్హాలు ఉన్నాయి.
    గ్రంథరూపంలో ముద్రైంచినప్పుడు దీన్నిచేర్చగలను
    మీ
    దార్ల

  8. sreenath reddy 06 నవంబర్ 2007 , 9:49 pm

    ముస్లీం మైనారిటి వాదం అనగానె మళ్ళీ ఇస్లాం వాదం మాటెమిటి అనెది ఎదురవుతుంది కదా. ఈ వాదాలు ఉద్ధరించెవెనా దార్లా? మతాన్ని బట్టి ఆర్ధిక పరిస్తితులుండవు….కానీ ఆర్ధిక స్థితి అన్నింటినీ నిర్ణయిస్తుంది. వాదాలూ వాటిలొ ఉప వాదాలూ ఉప ఉప వాదాలూ శకల పంజరాలుగా ఏర్పడి మెలు చెస్తున్నాయొ కీదు చెస్తున్నాయొ ఆలొచించండి. సాహిత్యాన్ని ఇట్లా
    (like specilisation in medicne) పరిశీలించడం తగదు దార్లా….ఒక ప్రత్యెక జీవితానుభవాన్ని కవిత్వ రూపంలొ మనమూ అంభవించడానికి వాదాలు అవసరం లెదు వాస్తవం(realityచాలు కదా….

  9. vrdarla 07 నవంబర్ 2007 , 2:44 am

    శ్రీనాథ్ రెడ్డిగారు!
    మంచి చర్చ లేవదీశారు. దీనిపై నా సమాధానం చెప్పేముందు పాఠకులు ఎలా ప్రతిస్పందిస్తారో చూద్దామా?
    మీ
    దార్ల

  10. khaja 08 నవంబర్ 2007 , 3:50 am

    …………………………………….
    ముస్లీం మైనారిటి వాదం అనగానె మళ్ళీ ఇస్లాం వాదం మాటెమిటి అనెది ఎదురవుతుంది కదా. ఈ వాదాలు ఉద్ధరించెవెనా దార్లా?
    …………………………………….

    ముస్లిం వాదం/ఇస్లాం వాదం లాంటివే వుధ్ధరించవనా అసలు ఏవాదాలూ ఎవరినీ వుధ్ధరించలేవనా మీరంటున్నది? అంటే స్త్రీవాదం, విప్లవ వాదం , ప్రాంతీయ వాదం .. ఇలాంటి ఏ వాదం వల్లా ప్రయోజనం లేదనా..?

    …………….
    మతాన్ని బట్టి ఆర్ధిక పరిస్తితులుండవు….కానీ ఆర్ధిక స్థితి అన్నింటినీ నిర్ణయిస్తుంది.
    ……………………..
    మతాన్ని బట్టి అర్ధిక పరిస్థితి వుండదన్నది మీ అవగాహన. సరే ఈదేశంలో ఆర్ధిక పరిస్థితికి కుల మతాలు కాక మరేవి కారణాలో మీరే వివరిస్తేవబాగుంటుంది.
    ఆర్ధిక స్థితి అన్నిటిని నిర్ణయించడంఏంటో కూడా.. వివరిస్తే బాగుంటుంది.

    …………………
    ఒక ప్రత్యెక జీవితానుభవాన్ని కవిత్వ రూపంలొ మనమూ అంభవించడానికి వాదాలు అవసరం లెదు వాస్తవం(realityచాలు కదా
    ……………..
    వాస్తవంలో విభజన వున్నపుడు సాహిత్యంలో అది ప్రతిబింబించడం తప్పంటారా ?

  11. Rakesh 08 నవంబర్ 2007 , 5:38 am

    I fully agree with the views expressed by Mr. Khaja.

  12. umamaheswara rao c 14 నవంబర్ 2007 , 7:45 am

    Poetry expresses agony and a resolution to set forth into bright future against injustice and exploitation.Then it is imperative that those who experience the ordeal can effectively express than the witness sympathisers.
    One can not forget that muslims, because they are having strong, medieval, historical sentiments of religious union, are alienated in the Indian society by socially and economically dominant caste hindus who always wanted satellite religions in the name of hindu dharma. This alienation has created fears and led to the division. Even after formation of Indian union,comfortably forgetting the spirit of the constitution the leftwing hindu elements are successful in blaming their fellow Indian citizens in the name of religion.These people like Baburao Patels or Bal Thakres are not taken to task by the governments or by law. Then certainly the toiling muslim [leave the rich ] should raise his voice against this disparity.Hence the expressions in poetry whatever name you give [Now a fresh menace from oil politics against muslims- scarring them as terrorists.]
    Many muslim writers experiencing this forced alienation in Indian society, have identified with marxism for better perspective of society and have enriched the world of poetry. If certain writers opine that they will be more expressive under some particular sect head, fine, it is reality and reason that count and marxism always stands against exploitation in whatever form it may be, unless the burning issues should not end up in absurdity and futility.
    The tamil speaking muslims are looked down by urdu speaking muslims in Tamilnadu. Mr. Nazar,the artiste, once told me how he tamil speaking muslim faced discrimination in getting the wife [of his choice] whose family speaks urdu. It is economics only that plays a dominant role in religion. It is untrue if one says that is not a prime issue. One should try to understand the plight of dalit muslims, who are basically agrarian poor.
    If there is no malice in saying that muslim women only face problems, it is fine, for women of other religions equally do. This is to say that any religion is discriminatory against woman and her expression. Moreover Indian Muslim woman is rejected of modern education and is facing the wrath of poverty. It is appreciable that telugu muslim women writers pioneer the cause.
    The essay is good.

  13. vrdarla 16 నవంబర్ 2007 , 1:41 am

    అభిప్రాయాలు రాస్తున్న వారికి అందరికీ నమస్సులు.
    మిత్రులు ఖాజా మంచి వివరణను ఇచ్చారు. థాంక్స్. నిజానికి ఖాజా ముస్లిము సాహిత్యం పై సాధికారికమైన ఒక గ్రంథం రాశారు. నాదగ్గర నుండి అది ఒక సాహిత్యాభిమాని పట్టికెళ్ళి దాన్ని ఇవ్వలేదు. తరువాత మరో కాపీ తీసుకోవాలను కున్నాను. కుదరలేదు. అందువల్ల దానిలోని విషయాలను పేర్కొనలేక పోయాను. గ్రంథ రూపంలో ప్రచురించేటప్పుడు మరికొన్ని చేర్చవలసి ఉన్నాయి.
    అలాగే ఉమామహేశ్వరరావు గారు విశ్లేషణాత్మకంగా రాసిన అభిప్రాయం నావ్యాసానికి మరింత విలువనిచ్చిందను కొంటున్నాను.
    వీరందరికీ నా కృతజ్ణతలు
    మీ
    దార్ల

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)