- ఎన్.వేణుగోపాల్

ఆరుపదులు నిండిన స్వతంత్రభారతం గురించి మురిసిపోవడానికేమున్నది? ఈ దేశ ప్రజలు ఏ ఆశలతో, కలలతో బ్రిటిష్ పాలకుల ను వెళ్లగొట్టి మహోజ్వల పోరాటాలు నడిపారో ఆ ఆశలన్నీ అడియాసలయిన, ఆ కలలన్నీ కల్లలయిన అరవైగ్రీష్మాలను చూసి గర్వపడడానికి ఏమున్నది? స్వాతంత్య్రమంటే తెల్లదొరలు దిగిపోయి నల్లదొరలు ఎక్కడం కాదని, ఒక మనిషిని వేరొక మనిషి పీడించే సాఘికధర్మం మారడమని భగత్ సింగ్ ఇచ్చిన నిర్వచనం గుర్తుతేలేనంత మొద్దునిద్దరలో సాగాయి ఈ ఆరుపదులు.

ఆ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ముహూర్తాన జవహర్‌లాల్ నెహ్రూ భవిష్యత్తుతో చేసుకున్న ఒప్పందం గురించి భాషా సౌందర్యానికి ముచ్చట పడడమే తప్ప ఆ ఒప్పందం ఎవరి మధ్య జరిగిందో, ఎవరి భవిష్యత్తు బండలై పోయిందో తెలుసుకోలేనంత సుషుప్తిలో సాగాయి ఈ ఆరుపదులు.

ఎవరి ప్రయోజనాలు గీటురాయిగా పాలన సాగాలని గాంధీ చెప్పాడో నిరుపేద, చిట్టచివరి మనిషి పాలకుల దృష్టిలో లేనేలేకుండా గడిచిపోయాయి ఈ ఆరుపదులు. మువ్వన్నెల మీదినుంచి కాషాయం నుంచి ముదురు ఎరుపు దాకా పాలకుల జెండాలు ఎన్ని రంగులుమార్చినా దోపిడీ, పీడనలలో, ప్రజల బతుకులో ఏమీ మార్పురాలేదు. ‘స్వతంత్ర భరత వర్ష వాస్తవ్యుడా మానవుడు, అతికించండి అతడి ముఖానికి మళ్ళీ చిరునవ్వు’ అని శ్రీశ్రీ రాసి సరిగ్గా అరవై సంవత్సరాలవుతున్న సమయాన వందకోట్ల భరతవర్షవాస్తవ్యుల ముఖాలమీద నిరాశానిస్పృహలు అరవైసంవత్సరాల కిందటికన్నా ఎక్కువయ్యాయి. భారతపౌరుల ముఖాలమీద చిరునవ్వులు అతికించడం కాదు, పెదాలమీదప్లాస్టర్లు అతికించే, చెవుల్లో సీసంపోసే, కళ్ళకు గంతలు కట్టే, అసలు మనుషులనే మాయంచేసే కార్యక్రమం నిర్విరామంగా సాగుతున్నది.

దౌర్జన్యం ప్రజాస్వామ్యం పేరుపెట్టుకుని రాజ్యం చేస్తున్నది.

దేశప్రజల వనరులను దేశదేశాల సంపన్నులకు దోచిపెట్టే కార్యక్రమం నిరాటం కంగా, అరవై ఏళ్లకిందకన్న ఎక్కువగా సాగుతున్నది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం రద్దయిపోయినా, రవి అస్తమించని బహుళజాతిసంస్థల సామ్రాజ్యం కొనసాగుతూ దానికి ప్రధానవలసగా, ముడిసరుకుల వనరుగా, సువిశాల మార్కెట్‌గా భారతదేశం అలరారుతున్నది. నూటయాభై ఏళ్ళకింద మొదలయి, అరవై ఏళ్ళకింద విజయం సాధించినట్టనిపించిన భారత స్వాతంత్య్ర సంగ్రామం లో ప్రాణాలు బలిపెట్టిన వేలాదిమంది అమరవీరుల భవిష్యదుజ్వల ఆశలు ఈ వర్తమానంలో అబద్ధాలై విషాదగానం చేస్తున్నాయి. రాష్ట్రంలోనూ, దేశంలోనూ జరుగుతున్న ఏ ఒక్క సంఘటన చూసినా మనం అనుభవిస్తున్నది స్వాతంత్య్రం కాద నీ, స్వాతంత్య్రమే అయితే అది ఏ పిడికెడు మందికోవచ్చినది తప్ప ప్రజలందరికీ అందినది కాదనీ అర్థమవుతుంది.

అరవై సంవత్సరాలలో దేశం ఏమి సాధించిందో, ఆ సాధించిన ఫలితాలు ఎవరి బొక్కసాలకు చే రాయో, దేశం ఏమి సాధించలేకపోయిందో, ఆ వైఫల్యాలు ఎవరి ఇంట కన్నీటినీ చీకటినీ నింపాయో కథలుకథలుగా వందకోట్ల కథలు చెప్పవచ్చు. వెలుగులేదని కాదు, ఆ వెలుగు ఎవరు హక్కుభుక్తం చేసుకున్నారు? ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, దేశ జనాభాలో తొంభై శాతం మందిమీద నీడను వ్యాపిం పజేసి కులుకుతున్న వెలుగు సమర్థనీయమేనా? ఆరుదశాబ్దాల స్వతంత్ర, ప్రజాస్వామిక, సమసమాజ, లౌకిక, సామాజికన్యాయ పాలన సాగినతర్వాత ఈ జనాభాలో అత్యధికులు తమకు న్యాయంగా అందవలసిన వాటా అందలేదని ఫిర్యాదుచేస్తున్నారు. శాసనవ్యవస్థ, కార్య నిర్వాహకవర్గం మాత్రమే కాదు న్యాయవ్యవస్థ, ప్రచారమాధ్యమాలు కూడా ప్రజాప్రయోజనాలకన్న స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్న ఈ స్వతంత్ర భారతం అరవై ఎళ్లకింది అస్వతంత్ర భారతం కన్న ఎక్కడ మెరుగ్గా ఉన్నదని ప్రశ్నిస్తున్నారు.

ఆరుదశాబ్దాల స్వతంత్ర భారత జనాభాలో పదిహేనుశాతం మందికి ఇంకా అస్ప­శ్యత తొలగలేదు. అస్పృశ్యులైతే చాలు వాళ్లమీద దాదూఫిర్యాదూ లేకుండా దౌర్జన్యం చేయవచ్చుననే, చంపిపారవెయ్యవచ్చుననే అగ్రవర్ణ అహం కారమూ చెక్కుచెదరలేదు. ఈ అరవై సంవత్సరాలలో దళితులమీద అత్యాచా రం జరగని రోజు ఉండి ఉండదు. ఆ అత్యాచారాలలో న్యాయస్థానందాకా వెళ్లి నేరస్తులకు శిక్షలు పడినవి నూటికి ఒక్కటి కూడా ఉండవు. ఎక్కడో ఒకచోట న్యాయం జరిగినట్టనిపించినా అది ఒక ప్రదర్శనవస్తువే, మినహాయింపే తప్ప సర్వసాధారణంకాదు. ఆరుదశాబ్దాల స్వతంత్రభారతంలో ఆదివాసులమీద బ్రిటిష్ పాలనలో కన్న ఎక్కువ దౌర్జన్యం జరిగింది. ఆదివాసులను వారి సహజ ఆవాసాలనుంచి నిరాశ్రితులను చేయడానికి, వారి నేలలో ఉన్న వనరులను, ఖనిజ సంపదను, అటవీ సంపదను బహుళజాతిసంస్థలకు, ఆ సంస్థల భారతీయ దళారీలకు దోచిపెట్టడానికి సకలప్రయత్నాలూ జరిగాయి, జరుగుతున్నాయి.

ఢాకా నేతపనివాళ్ళ చేతివేళ్ల కణుపులు తెగగోసిన, అనేక చేతివృత్తులకులాల జీవితాలను అతలాకుతలం చేసిన, భారతీయ వ్యవసాయాన్ని ధ్వంసం చేసిన దుర్మార్గం గురించి బ్రిటిష్ పాలకులను నిందిస్తూ ఉంటాం. మరి ఆరుదశాబ్దాల స్వతంత్రభారతంతో ఎంతమంది నేతపనివాళ్లు ఆత్మహత్యలకు బలి అయ్యారో, లక్షలాది పల్లెలు కన్నీరు పెట్టి సబ్బండవర్ణాలు చితికిపోయిన దృశ్యాలు ప్రదర్శిం చాయో, అధికారిక గణాంకాల ప్రకారమే ఎన్ని లక్షలమంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారో - ఎవరిని నిందిద్దాం? జనాభాలో సగంగా ఉండి ఇవాల్టికీ అధికారాలలో, అవకాశాలలో సగం కాదుగదా, మూడో వంతు పొందడానికి కూడ అనేక అవరోధాలు ఎదుర్కొం టున్న మహిళల మీద భ్రూణహత్యలనుంచి సతీసహగమనాల దాకా బ్రిటిష్ పాలనాకాలపు అత్యాచారాలలో ఏ ఒక్కదాన్నీ తుదముట్టించలేకపోయిన ఆరుదశాబ్దాల స్వాతంత్య్రం మనది.

మతం, భాష, జాతి పరంగా అల్పసంఖ్యాకులైనవారిమీద నిత్యం దౌర్జన్యం జరుగుతున్న సర్వధర్మ సమభావ రాజ్యం మనది. పౌరహక్కులు రాజ్యాంగంలో అలంకారంగా మిగిలిపోయి, చట్టబద్ధపాలన అనేది హాస్యాస్పదమైపోయి, చట్టం అమలుకావాలని అడిగినందుకు నెత్తుర్లు పారి, అధికారంలో ఉన్న వారి ఇష్టారాజ్యంగా చట్టం చలామణీ అవుతున్న హింసారాజ్యం మనది. ఆరుదశాబ్దాల స్వతంత్రపాలనతర్వాత, తిండిగింజల ఉత్పత్తిలో నాలుగున్నరరెట్ల పురోగతి సాధించికూడా మూడురెట్లు పెరిగిన జనాభాకు అన్నం పెట్టలేకపోతున్న అన్నపూర్ణరాజ్యం మనది. ప్రపంచ పేదలలో సగానికన్న ఎక్కువకు ఆశ్రయమిస్తున్న సంక్షేమరాజ్యం మనది.

తరతరాలుగా మన ప్రజలు కాపాడుకుంటూవస్తున్న ఖనిజ వనరులనూ, సహజవనరులనూ ఒకటిరెండుతరాలలో ఖాళీ చేయగలిగే, ఆధునిక ఈస్టిండియా కంపెనీలకు అప్పగించగలిగే విధానాలనూ ఆచరణనూ నిస్సిగ్గుగా అమలు చేస్తున్న సర్వసత్తాక రాజ్యం మనది. శాసననిర్మాతలు, రాజకీయవేత్తలు కావడమంటే అతి ఎక్కువ లాభాలు సంపాదించే వ్యాపారంలోకి దిగడంగా అర్థం మార్చిన ప్రజాస్వామిక వ్యవస్థ మనది. అంతంత పెద్ద విషయాలు అక్కరలేదు, అంత వెనక్కికూడ వెళ్లనక్కరలేదు. గత రెండువారాలలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, అన్ని రాజ్యవ్యవస్థలూ చేసిన పనులు-అణు ఒప్పందం నుంచి ఖైదీల క్షమాభిక్ష నుంచి తస్లీమా మీద దాడిదాకా- చూస్తే గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వచ్చాడనే సామెత గుర్తు వస్తుంది. ఇది స్వాతంత్య్రం అవునోకాదో, అయితే ఎవరిదో వారే తేల్చుకోవచ్చు.

సౌజన్యం: ఆంధ్రజ్యోతి

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)