- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

ఈనాడు మనుషులకు ఎదురవుతున్న సమస్యల మూలాలు చరిత్ర మొదలవని దశల్లోనే కనబడతాయి. వీటికి ముఖ్య కారణాలు సామాజికమే అయినప్పటికీ కొన్ని జీవశాస్త్రపరంగా కూడా పరిగణించదగ్గవి. మానవ ప్రవృత్తిని అర్థం చేసుకోవడానికి డార్విన్ ప్రతిపాదించిన పరిణామవాదం బాగా పనికొస్తుంది. ఒకటిన్నర శతాబ్దం కిందటి ఈ ప్రతిపాదనలకు ఆధునిక యుగంలో జన్యు విశ్లేషణ ద్వారా రుజువులు లభిస్తున్నాయి.

ఈ వివరాలను స్థూలంగానైనా తెలుసుకుంటే ప్రకృతిలో మనిషి ఉనికిని గురించిన సరైన అవగాహన కలుగుతుంది. తక్కిన ప్రాణుల మధ్యలో వాటి సరసనే కొన్ని పరిస్థితుల్లో తలెత్తిన మానవజాతి పరిణామం ఎలా జరిగిందో తెలిస్తే మనుషుల సహజలక్షణాలుగా పేర్కొనబడుతున్నవన్నీ ఎప్పుడు, ఎలా, ఎందుకు ఏర్పడ్డాయో కొంతవరకైనా అర్థమవుతుంది. ఆ దిశగా చేస్తున్న చిన్న ప్రయత్నమే ఈ వ్యాసాల సమర్పణ.

ప్రాణులన్నీ ఒకే కుదుటినుంచి పుట్టాయని మనకు తెలుసు. వీటిలో మనను ఏమాత్రమూ పోలనివీ, మనతో కొంత పోల్చదగినవీ, మనకు దగ్గర బంధువులనిపించే వానరాలూ ఇలా అనేకం ఉన్నాయి. జంతువులతో పోలిస్తే మనిషికి ప్రత్యేకత కలిగించే లక్షణాలు చాలానే ఉన్నాయి. మేధాశక్తిలోనూ, సాంఘిక పరిణామంలోనూ జంతువుల్లో మనిషికి సాటి రాగలిగినవి లేవు. జీవపరిణామ క్రమంలో మనిషికి అబ్బిన ప్రత్యేకతలన్నీ దాదాపు ఒకేసారి రూపొందాయి. చిత్రమేమిటంటే వీటన్నిటికీ పరస్పర సంబంధాలున్నాయి. ముందు కాళ్ళు చేతులుగా మారడంతో వాటికి కొత్త నైపుణ్యం అలవడింది. నడవడం, పరిగెత్తడం, నడక నుంచి విముక్తి పొందిన చేతులతో ఆయుధాల తయారీ ఇవన్నీ కూడా అపూర్వమైన పరిణామాలకు దారితీశాయి. చెట్లను అంటిపెట్టుకుని తప్ప జీవించలేని వాలిడి కోతులూ, నరవానరాలలాగ కాకుండా మనుషులు ఆహారానికై జంతువుల మందలను వెంబడిస్తూ వివిధ ప్రాంతాలకు కాలినడకన వెళ్ళగలిగారు. ఈ ప్రయాణాలు తొలి మానవులను రకరకాల వాతావరణానికీ, నైసర్గిక పరిస్థితులకూ గురిచేసి, వారి సామర్థ్యాన్ని పెంచాయి. ఇదంతా క్రమంగా వారి మెదడు నిర్మాణంలో అభివృద్ధికి దారితీసింది. మొదట్లో క్రూరమృగాలు చంపిన కళేబరాలను పీక్కు తినటానికి పనికొచ్చిన రాతి పనిముట్లు క్రమంగా ఆయుధాలుగా మారసాగాయి. వాటి తయారీ వల్ల చేతులకు పనిపెరిగిన కొద్దీ మెదడు వికాసం కూడా జరగసాగింది. చేతులూ,వేళ్ళ కదలికలను శాసించే మెదడులోని భాగాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. తత్ఫలితంగా రెండు కాళ్ళ మీద నడవగలగడం, పనిముట్లు చేసుకోవడం, ముందాలోచనతో వ్యవహరించడం మొదలైన విశేష శక్తులన్నీ కలిసి ఏర్పడ్డాయి. దీనివల్ల కొన్ని అనుకోని మార్పులు జరిగాయి.

దీనికి పూర్వరంగం ఎటువంటిది? మనిషి ఆవిర్భావం జరగడమే యాదృచ్ఛికం. లక్షలాది సంవత్సరాల క్రితం భౌగోళిక పరిస్థితుల్లో కలిగిన మార్పులవల్ల నాలుగు కాళ్ళతో పరిగెత్తే నరవానరజాతుల్లో కొన్నిటికి రెండుకాళ్ళ నడక తప్పనిసరి అయింది. మరే ప్రాణికీ లేని విధంగా పనులు చేసుకోవడానికి చేతులనేవి ఏర్పడ్డాయి. పనిముట్లద్వారా ఆహారం మరింత బాగా సంపాదించుకోవడంతో రానురాను సున్నితమైన పనులకు చేతులు అలవాటు పడడం, దానికి అనుగుణంగా మెదడు పెరగడం జరిగింది.

తక్కిన తేడాలన్నీ అంచెలంచెలుగా ఒకదాన్నుంచి ఒకటిగా రూపొందసాగాయి. అడవుల్లో జీవిస్తూ అందుబాటులో లభిస్తున్న ఆహారంతో సరిపెట్టుకునే పరిస్థితులు మారిపోయాయి. ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలకు ప్రయాణించిన తొలి మానవులకు తిండి ఒక సమస్య కాసాగింది. జంతువుల మందలను వెంబడించి వేటాడడం మొదలైంది. ఏరుకుతినే దశనుంచి వేటాడే దశకు చేరుకోవడంతో ముందుగా ఆలోచించుకోవడం అవసరమయింది.. దీనికి తగినట్టే మెదడు విపరీతంగా పెరిగింది. అందువల్ల మనిషి తల పెద్దదయింది. వానరాల్లా కాకుండా నిటారుగా నిలబడ్డ మనిషికి ముఖం అంతకంతకూ విశాలమవుతున్న మెదడుకు కింది భాగాన అమరింది. భౌతిక పరిస్థితులు శాసించిన మార్పులు మనుషుల శరీరాల్లో క్రమంగా మరెన్నో పరిణామాలు కలిగించాయి.

వన్యప్రాణుల్లో ఒకటిగా పెరిగిన మానవజాతికి క్రమంగా ప్రత్యేక లక్షణాలు కలగసాగాయి. జంతువుల పిల్లలు పుట్టీ పుట్టగానే నేల మీద పడి చకచకా నడవడం, తల్లివెంట పరిగెత్తడం చేస్తాయి. అందులో “పురుటినొప్పులు” కూడా ఉండవు. పిల్లలు త్వరగా పెద్దవై యుక్తవయసుకు వచ్చేస్తాయి. జీవనశైలిలో మార్పులను సాధించిన మనుషుల్లో మటుకు అలా జరగదు. మనుషుల పిల్లలు నిస్సహాయులై పుట్టడమే కాదు, తమ జీవితకాలంలో నాలుగోవంతు పెరుగుదలలోనే గడుపుతారు. ఈ సుదీర్ఘవ్యవధిలో వారి మెదడు అంతులేని అభివృద్ధి సాధిస్తుంది.

తక్కిన వానరజాతి జంతువులతో పోలిస్తే మనుష్యులు పుట్టే పద్ధతి చాలా విషయాల్లో ప్రత్యేకమనే చెప్పాలి. ప్రసూతి సమయంలో స్త్రీలు అసహాయతకు లోనైనంతగా మరే వానరజాతి ప్రాణి విషయంలోనూ జరగదు. మనిషి సామాజిక జీవితానికీ, రెండుకాళ్ళ నడకకూ దీనితో సంబంధం ఉందని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. జంతువుల్లాగ కాకుండా మరొక మనిషి మంత్రసానిగా సాయం చెయ్యవలసిరావడం సామాజిక అంశమే. డార్విన్‌ సిద్ధాంతం ప్రకారం చూస్తే ప్రసూతిలో ఇతరుల సహాయం పొందిన తల్లులు పొందనివారికన్నా బాగా మనగలిగారన్నమాట. వానరాల్లా సహజమైన పద్ధతి అవలంబించిన స్త్రీలలో మరణం ఎక్కువగా సంభవించి ఉండాలి. అందువల్ల ఆ శరీర లక్షణాలు అంతరించిపోయాయి.

రెండుకాళ్ళ నడక కారణంగా మనుష్యుల కటి భాగపు వెడల్పు తక్కిన వానరజాతి జంతువులకన్నా తక్కువగా ఉంటుంది. యోనిమార్గం ఇరుకవడం వల్ల పిల్లలు పుట్టడం కష్ట మవుతుంది. తల్లికి బాధ కూడా ఎక్కువౌతుంది. మనిషి మెదడు పరిమాణం పుట్టినప్పటితో పోలిస్తే పెద్దయాక మూడింతలు పెరుగుతుంది. కోతుల్లో ఇది రెండింతలే. ఈ పెరుగుదల గర్భంలో ఉన్నప్పుడే సజావుగా జరగాలంటే తల్లి బిడ్డను 21 నెలలు మొయ్యాలి. అలా జరిగితే పుట్టే నాటికి శిశువు తల విపరీతంగా పెరిగిపోయి బిడ్డ బైటకు రావడం అసాధ్యమౌతుంది. నెలలు నిండడం చింపాంజీల్లో మనిషిలాగే జరుగుతుంది కాని శిశువు మెదడులో మనిషికన్నా చాలా ఎదుగుదల కనిపిస్తుంది. పుట్టినప్పుడు కోతి పిల్లలు మనుష్యులంత నిస్సహాయంగా ఉండవు.

మనిషికి జీవపరిణామం మందగించి సాంఘికజీవితం మొదలవడంతో దానికి అనుగుణంగా శరీరంలో, ముఖ్యంగా మెదడులోనూ, ఇతర లక్షణాల్లోనూ మార్పులు అనివార్యం అయాయి. నోటి నిర్మాణంలోనూ, నాలుక కండరాల్లోనూ జరిగిన అభివృద్ధి మాట్లాడడనికీ, భాష పెరుగుదలకూ దోహదం చేసింది. చిన్న చిన్న తెగలుగా సమాజజీవితం ప్రారంభించిన ఆదిమమానవులకు భాషా, తద్వారా ఇతరులతో సంపర్కమూ కలిగించిన లాభాలు ఇంతా అంతా కాదు.

మనిషి వ్యవసాయం మొదలుపెట్టి, స్థిరనివాసాల్లో జీవించడంతో తినే ఆహారంలో వైవిధ్యం పెరిగింది. కార్బోహైడ్రేట్ల రూపంలో అనేక ధాన్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యం మెరుగుపడింది. పిల్లలకు పాలు మాన్పి ఇతర ఆహారం అలవాటు చెయ్యడం వీలయింది. తల్లులు మంచి పోషక ఆహారం తినడంవల్ల పది, పదిహేను నెలలలో మలి కాన్పుకు సిద్ధం అవసాగారు. ప్రకృతి వైపరీత్యాలకు గురికాకుండా మనుషులు తమను తాము కాపాడుకోగలిగారు. పుట్టినప్పుడు బలహీనంగా ఉన్నప్పటికీ మనుషులు ఒకరికొకరు తోడ్పడే సమాజ జీవితం ద్వారాఇతర ప్రాణులకన్నా అభివృద్ధి సాధించగలిగారు.

ఈ పరిణామాలవల్ల ఏమౌతుంది? మనుష్యుల తలలు పుట్టినప్పుడు అంతకంతకూ పెద్దవౌతాయి. సహజ ప్రసూతిలో శిశువు తల నొక్కుకుపోయి భరించరాని బాధ కలుగుతుంది. మునుపటి కన్నా ఈ రోజుల్లో సిజేరియన్‌ పద్ధతిలో పిల్లలు పుట్టడం ఎక్కువైంది. శస్త్రచికిత్సలో జరిగిన అభివృద్ధి దీనికి కొంత కారణం కావచ్చు కాని పిల్లల తలలు అంతకంతకూ పెద్దవి కావడం కూడా ఇందుకు కారణమేమో. ఈనాటి పోటీ ప్రపంచంలో తెలివితేటలు లేకుండా పెరగడం అసంభవం కనక ఇది ప్రకృతిలో జరిగిన ఏర్పాటేమో.

పిల్లలు పుట్టి పెరగడానికీ, మనుషులు సమాజాలుగా ఏర్పడడానికీ కూడా గట్టి సంబంధం ఉందని కొందరు శాస్త్రవేత్తలంటారు. సమష్టిగా పెంచిన పిల్లలు బతికి బట్టకట్టే అవకాశం ఎక్కువ. అందరు ఆడవాళ్ళకూ కాన్పు ఒకేసారి రాదు గనక సాటివారికి తోడ్పడడం, ఒకరినుంచి మరొకరు నేర్చుకుని పిల్లల్నికాపాడడం వీలవుతుంది. ఐకమత్యమే మహాబలంగా పెరిగిన ఆదిమానవుల తెగలకు పిల్లల పెంపకంలోని ప్రాముఖ్యత అర్థమై ఉంటుంది. ఇవన్నీ ఆధునిక శారీరక లక్షణాలు బలపడడానికి దోహదం చేసి ఉండాలి.

ఈ రోజుల్లో మనుష్యుల ఆరోగ్యం బాగా మెరుగుపడింది. టెస్ట్‌ట్యూబుల్లో శిశువులు రూపొందే రోజులొచ్చాయి. మనిషి శరీరనిర్మాణం మాత్రం ఆనాటి ప్రత్యేక పరిస్థితుల్లో రూపుదిద్దుకుందనేది మరిచిపోరాదు. ఆయుర్వేదంలోనూ, ఇతర ప్రకృతివైద్యాల్లోనూ అసహజ జీవనవిధానాన్ని గురించి విమర్శిస్తూ గొంతు చించుకునేది అందుకే.

13 అభిప్రాయాలు

  1. B.Ajay Prasad 05 జులై 2007 , 7:48 am

    రోహిణీ ప్రసాదుగారూ మీ వ్యాసాలు చాలా బాగుంటున్నాయి. మీ నాన్నగారిలా మీరు ఒక మంచికథ రాస్తే చూడాలని ఉంది. మీ నాన్నగారినుంచి స్ఫూర్తిపొందిన వేలాదిమందిలో నేనూ ఒకడిని. ఆయన రాసిన ప్రతి కధ, నవల, గల్పిక, మొదలగు ప్రక్రియల్లో ప్రతిపేరాలోనూ అద్భుతమైన తర్కం, త్వాత్వికత , అజరామరం. ఆయన సౄష్టించిన సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

    మీరూ వ్యాసంగం నుంచి సాహిత్యంలోకి రావచ్చునుకదా. మీరు మంచి సంగీతవిద్వాంసులని తెలుసు. సంగీత విద్వాంసులలో మంచి కవులు కూడా ఉన్నారు.

    మరొక విషయం: మీరు పాత చందమామలను భధ్రపరిచారా. అలా చేస్తే అందరికీ అందుబాటులో ఉండేట్లు చేయగలరు. చందమామ కొన్ని దశాబ్దాలపాటు చక్కని బాలసాహిత్యాన్ని మనకు అందించింది కదా. చందమామనుంచి ఎదిగిన మేధావులు తెలుగుసమాజంలో ఎందరో ఉన్నారు. భవిష్యత్తు తరాలకోసం, ముఖ్యంగా తెలుగువారికోసం ఆ చందమామలను భధ్రపరచవలసి ఉంది.

  2. Rohiniprasad 06 జులై 2007 , 1:57 pm

    అజయ్ ప్రసాద్ గారూ, ప్రజాసాహితి తదితర పత్రికల్లో మీ కథలు చూశాను. చాలా ఏళ్ళ క్రితం సోమంచి యజ్ఞన్నశాస్త్రిగారి ప్రోద్బలంతో నేను సైన్సు కథలు కొన్ని రాశానుగాని ఫిక్షన్ రాయలేదు. రాయాలనిపించదు. అయితే ముందు ఏం చేస్తానో నాకే తెలీదు! నాకున్న తక్కువ వ్యవధిలో ప్రస్తుతం ఎన్నెన్నో పనులు చేస్తున్నాను.

    చందమామ పాత సంచికలన్నీ డివిడిలుగా వెలువరిస్తున్నామని పబ్లిషర్లు ప్రకటించారు కనక అవి దొరుకుతూ ఉండాలి. ప్రయత్నించండి.

  3. Kameswara Rao 19 సెప్టెంబర్ 2007 , 11:33 am

    రోహిణీ ప్రసాద్ గారూ,
    “ఈ ప్రయాణాలు తొలి మానవులను రకరకాల వాతావరణానికీ, నైసర్గిక పరిస్థితులకూ గురిచేసి, వారి సామర్థ్యాన్ని పెంచాయి. ఇదంతా క్రమంగా వారి మెదడు నిర్మాణంలో అభివృద్ధికి దారితీసింది. ”
    “జంతువుల మందలను వెంబడించి వేటాడడం మొదలైంది. ఏరుకుతినే దశనుంచి వేటాడే దశకు చేరుకోవడంతో ముందుగా ఆలోచించుకోవడం అవసరమయింది.. దీనికి తగినట్టే మెదడు విపరీతంగా పెరిగింది.”

    మనిషి కన్నా చాలా జంతువులకి చాలా దూరాలు ప్రయాణించగలగటం, చక్కగా వేటాడగలగటం వచ్చిన విషయాలు. కాబట్టి ఈ రెండూ మెదడు అభివృద్ధికి కారణాలెలా అయ్యాయో ఆశ్చర్యంగా ఉంది. మెదడు పెరగడానికి మరేదైనా బలమైన కారణముండడమో, లేదా అది యాదృచ్చికమో అయుండాలని నా ఆలోచన.
    డార్విన్ జీవపరిణామ సిద్ధాంతంలో పరిణామ గతి (rate of evolution) గురించి ఏమైనా ఉన్నదా? ఇంతవరకూ ఇతర జీవులలో జరిగినన పరి ణామంతో పోలిస్తే, మనుషులలో జరుగుతున్న పరిణామం ఎలా ఉంది (వేగంగానా, మెల్లగానా) అన్న విషయాన్ని ఎవరైనా పరిశోధించారా? జీవ పరిణామంలో ముఖ్యమైన natural selection and mutations, మనుషుల విషయంలో ఏ గతిలో,ఏ దిశగా జరుగుతున్నాయి అన్న విషయాలు గురించి నాకు ఆసక్తి ఉంది. ఏమైనా వివరాలు తెలిస్తే దయచేసి చెప్పండి.

  4. Rohiniprasad 19 సెప్టెంబర్ 2007 , 2:06 pm

    కామేశ్వరరావుగారూ,

    మరీ ఎక్కువవౌతాయనిపించడంతో నేను వివరాలన్నీ రాయలేదు. మనుషులు చేసిన ప్రయాణాలు రెండుకాళ్ళ నడక మీద ఆధారపడినటువంటివి. ఆ ప్రక్రియలో శరన్నీనిటారుగా నిలబడ్డ తీరూ, ఎక్కువ దూరం చూడగలగడం, తద్వారా చూపు మెరుగవడం, చేతులకు స్వాతంత్ర్యం లభించడం మొదలైనవన్నీ మెదడునూ, నాడీమండలాన్నీ అభివృద్ధి చేశాయి. నాలుగు కాళ్ళ మీద పరిగెత్తే జంతువులలో అటువంటిది జరిగే అవకాశం లేదు. క్షీరదాల్లో మెదడు మెరుగుపడిన వానరజాతుల నుంచి మనుషులు రూపొందారు కనక రెండుకాళ్ళ మీద నడవడం మనుషులకు మరింతగా లాభించింది. పనిముట్లు మొదలైనవి చేస్తున్నప్పుడు చేతులను నియంత్రించే మెదడు భాగాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి.

    మనుషులు వేటాడడం జంతువుల పద్ధతిలో జరగదు. అందులో వేటాడదలిచిన జింకలవంటివాటిని పరిశీలించడం, రుతువులని బట్టీ, ప్రాంతాన్ని బట్టీ అవి దొరికే అవకాశాలని అంచనా వేసుకోవడం మొదలైనవన్నీ ఉండేవి. ఆయుధాలనూ, సాటివారి సహకారాన్ని సమకూర్చుకోవడం ఉండేది. అనేక కొత్త ప్రాంతాలకు వెళ్ళి అక్కడి పరిస్థితులకు తట్టుకుని అలవాటుపడడం ఒక్క మానవులకే సాధ్యమైంది. చలి ఎక్కువైతే నెగళ్ళనూ, చర్మాలనూ ఉపయోగించి నెగ్గుకురావడం వగైరాలు ఇతర ప్రాణులు చెయ్యలేవు.

    కొన్ని వివరాలను నేను మరొక వ్యాసంలో ప్రస్తావించాను (http://poddu.net/?p=353).

    పరిణామగతి బైటి పరిస్థితులు మారడాన్ని బట్టే ఉంటుంది కదా. Genetic mutations లో epigenetics పాత్ర కూడా ఉంటుందని అంటున్నారు. ఏ జన్యువు ఎక్స్ ప్రెషన్ ఎప్పుడు మొదలై, ఎప్పుడు అంతమవుతుందో నిర్ణయించేది epigenetics. అందుకనే చింపాంజీ దవడ పెరిగే వ్యవధి మనకన్నా ఎక్కువగానూ, మన మెదడు పెరిగే వ్యవధి వాటికన్నా ఎక్కువగానూ ఉంటుందట. ఈ తేడాలన్నీ ఆదిమానవుల జీవనశైలి వానరాలకు భిన్నంగా సాగడంవల్లనే తలెత్తాయని అంటారు. అంటే అవి బాహ్యపరిస్థితులు నిర్దేశించినవే. సంఖ్యాపరంగా చూస్తవిమనకూ, చింపాంజీలకూ జన్యువులు దాదాపుగా ఒకటే. ఉన్న తేడాలన్నీ epigenetics స్థాయిలో ఏర్పడ్డవే. (నేను జీవశాస్త్రం చదువుకోలేదు. నా సబ్జక్ట్ న్యూక్లియర్ ఫిజిక్స్. అయితే మీలాగే నాక్కూడా ఇవన్నీ ఆసక్తికరమైనవిగా అనిపిస్తాయి.)

  5. Rohiniprasad 20 సెప్టెంబర్ 2007 , 11:34 am

    కామేశ్వరరావుగారూ,

    ఈ లింక్ కొంత సమాచారం ఇస్తుంది:
    http://www.nytimes.com/2007/09/20/science/20fossil.html

  6. work at home 27 డిసంబర్ 2007 , 8:26 pm

    work at home…

    t8t…

  7. polyphonic ringtone 28 డిసంబర్ 2007 , 3:50 pm

    polyphonic ringtone…

    t726t…

  8. ma992zda 20 జనవరి 2008 , 1:30 am

    lpt vpn…

    t805t…

  9. ma908zda 22 జనవరి 2008 , 9:01 pm

    Used Nextel Phones…

    t650t…

  10. real time forex chart 02 ఫిబ్రవరి 2008 , 3:20 am

    real time forex chart…

    t548t…

  11. swiss forex 02 ఫిబ్రవరి 2008 , 3:34 am

    swiss forex…

    t504t…

  12. Rohiniprasad 26 మార్చ్ 2008 , 3:10 pm

    ప్రాణుల్లో మనుషులు ప్రత్యేకమనీ, తక్కినవాటికి తెలివితేటలు ఉండవనీ అనుకుంటాం. అయితే పరిస్థితులనుబట్టి ఎలుకవంటి ప్రాణికి కూడా కొత్త నైపుణ్యం ఎలా అలవడుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఒకప్పుడు చింపాంజీల్లోనూ, ఇటీవల కొన్ని పక్షుల్లోనూ బైటపడిన తెలివితేటలు ఏ జంతువులోనైనా పెరిగే అవకాశం ఉంటుందనిపిస్తుంది.

    http://www.nytimes.com/2008/03/26/science/26rodentw.html

  13. mortgage quote tips2008 31 మార్చ్ 2008 , 4:58 am

    mortgage quote tips2008…

    t432t…

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)