- కొండేపూడి నిర్మల

నిజానికి ముందు నుంచీ అమ్మీకి తెలుసు, దీదీకి తెలుసు
అఖండ పాతివ్రత్యం లాంటి ఈ దేశభక్తి
వితంతు దుఖాన్ని తప్ప నీ బేటీకేమిచ్చింది అబ్బాజాన్
చైనా యుద్ధంలో, పాకిస్తాను పోరులో, కాశ్మీరు రణబలిలో

ఎప్పుడైనా ఎక్కడైనా చచ్చిగాని నిరూపించుకోలేని పౌరసత్వాలున్నచోట
దేశం విజయోత్సాహాలతో కేరింతలు కొట్టినప్పుడల్లా
మన ఇంటికి శవపేటికలే కదా తిరిగొస్తాయి
తలాక్…తలాక్….తలాక్….
కలకాలం కాపురముంటున్న కన్నీటి బిందువులారా
మెజారిటీ భావావేశాలకు భిన్నంగా కుమిలిపోయే
ఈ దేశద్రోహి కళ్ళనుండి పారిపోండి
మువ్వన్నెల జెండా పడగ నీడలో కన్నుమూసిన
నా సహచరుడి స్ఫూర్తితో తప్పించుకు పొండి
ఆర్టీసీ బస్సుల మీదా, రైళ్ళమీదా గీసిన
ఆడమొహాల మాదిరి
చెరపడానికి నా నుదుట బొట్టు లేదు
బద్దలయిన గాజులకీ, పూసలకీ
నా గుండె కంటే ఎక్కువ ముక్కలవడం చాతకాదు

ఆస్తితో సహా ఆడదాన్ని ఏలుకోవడానికి
కీర్తివంతులయిన నా అత్తింటి వారెవరో ముందుకొస్తారు
బహుశా మరి కొన్ని సార్లు వితంతునవడానికి నేను పులకించిపోవాలి
నిఖా సంబరాలు వెలిసి పోకుండానే
ఫాతిహాలకు దర్బారు తీరిన మన జీవితాల్లో
దేనికీ మాత్రం అర్ధసందర్భాలున్నాయని…

పుట్టుకలా? రక్తసంబంధాలా? ప్రేమలా? సమాధులా?
దిక్కులు పిక్కటిల్లే చప్పట్ల మద్య
కొలువు తీరిన కన్నీటి బిందువుల వరసలో కూర్చున్న
నా వొళ్ళోంచి ముద్దులు మూటగట్టే నీ మనమడేమన్నాడో విన్నావా?
“మైభీ మిలట్రీ ఆఫీసరు బనూంగా…..”
ఏ తల్లి కడుపులోంచో ఇంకా పుట్టని వితంతు స్వరం
ఉలిక్కిపడి కదిలినట్టు
నా చూపులు నేల రాలి పోతున్నాయి
క్షమించు అబ్బాజాన్
గర్వంతో ఉప్పొంగడం నా చేతకావడం లేదు.

9 అభిప్రాయాలు

  1. నాగరాజా 10 మే 2007 , 1:28 am

    నిర్మల గారు,

    ప్రపంచంలో జరిగే మంచి విషయాల గురించి కూడా మీరు వ్రాస్తే చదవాలని ఉంది. ఆవేశం అనర్ధదాయకం అని పెద్దలు అన్నారు కదా! జరిగినది చాలా చెడ్డ విషయమైనా, కేవలం పేపర్లను చదివి ఆవేశపడడం అంత తెలివైన పని కాదని నా అభిప్రాయం. మీవంటి పేరున్న కవుల మాటలను శ్రద్ధ పెట్టి చదువుతాం కాబట్టి కొంచెం ఎక్కువ సమయం తీసుకొని వ్రాయగలరు.

    - నాగరాజా.

  2. సత్యసాయి 10 మే 2007 , 2:09 am

    నిర్మల గారూ,
    మీ కవిత కాసింత దుమారం లేపింది. తెలుగు బ్లాగర్ల గుంపులో మీ కవిత మీది చర్చలో కొద్ది ముక్క..
    “పైన వ్యాఖ్యలు వ్రాసిన వాళ్ళందరూ దయచేసి ఒక్క సారి ఆ కవిత సాంతం చదివి
    ఆనక ఇంకో వ్యాఖ్య తప్పక వ్రాయండి.
    ఆ కవిత ఒక ముస్లిం సైనికుడి వితంతు భార్య ఆవేదన. అది కాంగ్రేస్ జండాకి,
    దేశ జండాకి ఉన్న పోలిక వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ గురించి కాదు. గుజరాత్
    సోహ్రూద్దీన్ గురించికాదు, పోలీసుజులుం గురించి కాదు. ఒక వ్యక్తిగా
    ఆమెకి ఎలాగైనా ఆవేదన పడే అర్హత ఉంది. కాని ఒక కవి ఆ ఆవేదనకి అక్షర రూపం
    ఇచ్చేటప్పుడు సామాజిక బాధ్యతని విస్మయించకూడదని నా అభిప్రాయం. నిర్మల
    గారి కవిత అందులో ని పదప్రయోగాలూ అబాధ్యతగా ఉన్నాయనడంలో సందేహంలేదు.
    అసలే ఒక పక్క ముస్లింలు జాతీయజీవనస్రవంతిలోంచి పక్కకి వెళ్ళిపోతున్నారని
    (వెళ్ళగొట్టబడుతున్నారని) అంటూన్న నేపధ్యంలో ఇలాటి కవితలు ఎలాంటి భావనలని
    కలగచేస్తాయో ఆలోచించండి. అసలే మన నాయకులు ప్రజల్ని రెచ్చకొట్టడమే పనిగా
    పెట్టుకున్నారాయెను. ఆవిడ, మతప్రస్తావన లేకుండా, ఒక సైనికుడి భార్య
    ఆవేదనగా ఆ కవితని మలిచినా కొంత వరకు బానే ఉండేది. అప్పుడు కూడా, ఇలాటి
    కవితలు ప్రతికూలభావనలు (నెగెటివ్ థాట్స్) కలిగించే అవకాశమే ఎక్కువ.
    కవిత్వాల ప్రయోజనం కవి భావ వ్యక్తీకరణే కాని దాని పర్యవసానంతో
    పనిలేదా?”

    మొత్తం చదవాలంటే.. ఈ లంకెలో చూడండి.
    http://groups.google.com/group/telugublog/browse_frm/thread/f7820f0a16e46c46/af9fe98dfc615243#af9fe98dfc615243

  3. తెలుగు బ్లాగు 10 మే 2007 , 2:54 am

    “దేశద్రోహి కన్నీటి చుక్క” కవిత పైన తెలుగు బ్లాగు నుండి పదకొండు అభిప్రాయాలు:

    1) cbrao
    May 8, 1:36 pm

    కొండేపూడి నిర్మల గారు,

    పై కవితలో
    http://prajakala.org/mag/2007/05/nirmala_maypoem

    మీరు రాసిన
    “మెజారిటీ భావావేశాలకు భిన్నంగా కుమిలిపోయే
    ఈ దేశద్రోహి కళ్ళనుండి పారిపోండి
    మువ్వన్నెల జెండా పడగ నీడలో కన్నుమూసిన
    నా సహచరుడి స్ఫూర్తితో తప్పించుకు పొండి”
    ఇందులో “మువ్వన్నెల జెండా పడగ నీడలో” అనే పద ప్రయోగానికి అర్థం చెప్పగలరా? అలా
    చెప్పవలసిన అవసర మేమిటి?

    -cbrao

    ………………………………..

    2) Prasad Charasala May 8, 2:09 pm

    రావు గారూ,
    గుజరాత్ లో భూటకపు ఎన్‌కౌంటరులో చనిపోయిన సొహ్రాబుద్దీన్ “మువ్వన్నెల జెండా పడగ” కాటుకే కదా బలయ్యింది. బహుశా నిర్మల గారు అలాంటి వాటి గురించే చెబుతున్నారనుకుంటానిక్కడ.

    –ప్రసాద్
    http://blog.charasala.com

    ………………………………..

    3) రవి వైజాసత్య May 8, 3:20 pm

    పోలీసు కళంకాన్ని దేశానికి ఆపాదించడమెంత సమంజసం?

    ………………………………..

    4) drchinthu May 8, 10:57 pm

    సామాన్య ప్రజానీకం దృష్టిలో ప్రభుత్వం అంటే పోలీసు కాబట్టి…ఇక్కడ జెండా
    ప్రభుత్వాన్ని సూచిస్తుంది దేశాన్ని కాదేమో…
    (నా దేశభక్తిని శంకించవద్దని మనవి!)
    అన్నట్ట్టు చెప్పడం మరచాను…రవి గారూ ‘శుభాకాంక్షలు’ మాలో చేరినందుకు!!!

    ………………………………..

    5) suryaguduru@gmail.com May 9, 12:06 am

    మువ్వన్నెలు ఒక్క జాతీయ జెండాలో మాత్రమే ఉంటే ఆ వన్నెలను జాతి మొత్తం గౌరవమిస్తుంది. స్వార్ధం‌తో ఒక రాజకీయ పార్టీ తన వన్నెలనే జాతీయ వన్నెలుగా మార్చి, అవే వన్నెలను తమ పార్టీకి కూడా వాడుకుంటూ, సామాన్య మానవునకు అవి పార్టీ వన్నెలో, జాతీయ వన్నెలో తెలియక
    తికమకమవుతుంటే ఇక జాతీయ వన్నెలకీ, ఆ జెండాకి గౌరవం ఏముంటుంది ఈ దేశం‌లో!

    ………………………………..

    6) సత్యసాయి కొవ్వలి On May 8, 3:20 pm,

    పైన వ్యాఖ్యలు వ్రాసిన వాళ్ళందరూ దయచేసి ఒక్క సారి ఆ కవిత సాంతం చదివి ఆనక ఇంకో వ్యాఖ్య తప్పక వ్రాయండి. ఆ కవిత ఒక ముస్లిం సైనికుడి వితంతు భార్య ఆవేదన. అది కాంగ్రేస్ జండాకి, దేశ జండాకి ఉన్న పోలిక వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ గురించి కాదు. గుజరాత్ సోహ్రూద్దీన్ గురించికాదు, పోలీసుజులుం గురించి కాదు. ఒక వ్యక్తిగా ఆమెకి ఎలాగైనా ఆవేదన పడే అర్హత ఉంది. కాని ఒక కవి ఆ ఆవేదనకి అక్షర రూపం ఇచ్చేటప్పుడు సామాజిక బాధ్యతని విస్మయించకూడదని నా అభిప్రాయం. నిర్మల గారి కవిత అందులో ని పదప్రయోగాలూ అబాధ్యతగా ఉన్నాయనడంలో సందేహంలేదు. అసలే ఒక పక్క ముస్లింలు జాతీయజీవనస్రవంతిలోంచి పక్కకి వెళ్ళిపోతున్నారని (వెళ్ళగొట్టబడుతున్నారని) అంటూన్న నేపధ్యంలో ఇలాటి కవితలు ఎలాంటి భావనలని కలగచేస్తాయో ఆలోచించండి. అసలే మన నాయకులు ప్రజల్ని రెచ్చకొట్టడమే పనిగా పెట్టుకున్నారాయెను. ఆవిడ, మతప్రస్తావన లేకుండా, ఒక సైనికుడి భార్య ఆవేదనగా ఆ కవితని మలిచినా కొంత వరకు బానే ఉండేది. అప్పుడు కూడా, ఇలాటి కవితలు ప్రతికూలభావనలు (నెగెటివ్ థాట్స్) కలిగించే అవకాశమే ఎక్కువ. కవిత్వాల ప్రయోజనం కవి భావ వ్యక్తీకరణే కాని దాని పర్యవసానంతో పనిలేదా?

    ………………………………..

    7) Prasad Charasala
    May 9, 10:09 am

    నాకైతే ఇందులో నెగటివ్ భావనలు కలిగించేదేముందో అర్థం కావట్లేదు. అసలు ఏ వుద్దేశ్యంతో ఆ పదం వ్రాశారన్నది రచయిత్రి చెబితే తప్ప మనకు అర్థం కాదు. మనం ఎన్ని రకాలుగానైనా దాన్ని అర్థం చేసుకోవచ్చు. మనకు కల్పవృక్షం నీడలా అంపించేది ఇంకొకరికి పాము పడగ నీడలా అనిపించొంచ్చు. అందుకు కారణాలేమిటో చూడాలిగాని అసలలా అననే వద్దు అంటే ఎలా? అయినా మన ఈ వాదోపవాదాలు అక్కడే ప్రజాకళలోనే చేస్తే బాగుంటుందేమొ!

    –ప్రసాద్
    http://blog.charasala.com

    ………………………………..

    8) cbrao
    May 9, 11:35 am
    ప్రజా కళ discussion forum కాదు. అది ఒక web magazine మాతమే.
    ………………………………..

    9) Prasad Charasala

    బ్లాగుల్లో మన వాదనలు వినిపిస్తున్నాం కదా అలాగే అక్కడానూ!

    –ప్రసాద్
    ………………………………..

    10) Kiran Kumar Chava
    May 10, 12:44 am

    అవును ఈ వాదోపవాదములు అక్కడే ప్రజాకళలో చేస్తే బాగుంటుంది. కానీ అక్కడ కూడా చిన్న సమస్య ఉన్నది, అది మోడరేటెడ్ కామెంట్సు స్వేచ్చ లేదు :(

    ………………………………..

    11) నాగరాజా
    May 10, 1:13 am

    మోడరేటెడ్ ప్రజా కళ? :) అది కొండేపూడి నిర్మల గారి కన్నీటి చుక్క…
    క్షమించు అబ్బాజాన్

  4. nirmala 11 మే 2007 , 1:31 am

    ” దేశ ద్రోహి కన్నీటి చుక్క”కు స్పందించిన వారందరికీ ధన్య వాదాలు.
    నా చిన్నప్పుడు “పాకిస్టాన నీ పిలక పీకిస్తాను”అనే పాట పాడుతూ నా కు నచ్చని వాల్లందరిని అలాగే పిలిచె దాన్ని.

    మా బంధువులల్లో ఒక ఆవిడని ఏవొ చిన్న ఆస్తి తగాదాల కారణం గా చైనా భూతం అని పిలుస్తారు ఇప్పటికీ.
    క్రికెటు కామెంట్రీ చదివండి ,వాళ్ళూ ఓడినప్పుడు మట్టి కరిచారని ,మనం ఓడినప్పుడు కాలు నొప్పి వల్ల గెలవ లేక పోయామని మీడియా వార్తలు రాస్తుంది.
    ఒక దేశాన్ని/జాతిని/కులాన్ని/ప్రాతీయాన్ని గురించి ద్వేషం ఇలా ఉగ్గు పాలతొ రంగరించి పోయడం ఒక నాగరికతగా మనం ఒప్పుకుంటున్నాం.

    మరి రాగ ద్వేషాలతో సంబంధం లేకుండా అన్ని యుద్ధాల లోనూ బలవుతున్నది స్త్రీలు.
    గెలుపు ఓటమి లతో కాకుండా కేవలం ఫలితాలు భరిస్తున్నదీ వీళ్ళే.
    మొన్న గుజరాత హింసలో ఒక రాజ్యం ఒక మతం చట్టబద్ధంగా చేసిన హింస మీరు చూసే వుంటారు.అటువంటి మంత్రై గొప్ప పాలకుడు గా బహౌమతి పొందడం కూడా మీకు తెలుసు.
    28 మంది రచయితలం కలిసి ఆ భీభత్సాలు చూసి వచ్చాం.
    ముస్లిమ కవయిత్రి షాజహానా తన కవితలో అంటుంది.
    ;నా మొగవాడూ,నా దేవుడే బాధిస్తున్నాడనుకుంటే
    ఇప్పుడు నీ మగవాడూ నీ దేవుడూ కూడానా….”అక్కడి అత్యాచారానికి గురయిన వాళ్ళ స్వరంలో…

    దేశభక్తులు /మువ్వన్నెల జెండాలు ఎవరికి కల్ప వ్రుక్షాలవుతున్నాయో గాని ఒక యుద్ధ వితంతువుకి ఇంకోలా కనిపీం చవచ్చు.

    కాబట్టి ప్రియ మిత్రులారా నాకవితని దాని వాస్తవ నేపధ్యం లో అర్ఢం చేసుకోండి.
    రాజ కీయాలు ముడి పెట్ట వద్దు.
    నిజానికి ఆ కవిత పంపడానికి ముందు నేను ఎడిట చేసిన పాదాలు కొన్ని వున్నాయి.అవి కూడా చదవండి.
    “ఎత్తుకెళ్ళిన వెండి కిరీటాల, బాణాల, కత్తెర్ల లాఘవంతో
    హుస్సేను సాగరపు టొడ్డున పౌరాణిక క్రిష్ణుడున్న చోట
    ఆయుధాలు కుంభకకోణం చేసిన వాడి అమాంబాపతు వంశక్రీడలే
    త్యాగధనుల చరిత్ర పుటలుగా చదువుకుంటున్న చోట
    పెదవులున్న వాళ్ళంతా మాట్లాడుతారా?
    హక్కులున్న వాళ్ళంతా ఆత్మ హననాల్నించి తప్పించు కుంటారా?”

  5. sravanthi 11 మే 2007 , 3:04 am

    అసలు అసలు విషయాన్ని పక్కన పెట్టి…కామెంట్లు రాసిన వాళ్ళందరికి నిజంగా జోహార్లు…బాధపడే వారిని కాకుండా…దెబ్బ కొట్టిన చేతిని ముద్దు పెట్టుకునే సంస్కారం , ఉన్నంత కాలం..మతం రంగు పులిమి…జాతీయ జెండా చుట్టు తిప్పారే కాని..బాధిత వర్గాన్ని గుర్తించే ప్రయత్నం చేయకపోవటం విషాదం..
    ప్రోత్సాహం ఇవ్వటం ఎలాగు రాదు…విమర్శ అయినా అలోచించి చేస్తే బాగుంటుంది

  6. hello guru 11 మే 2007 , 4:46 am

    నాన్సెన్స. ఎప్పుడు ఎడుపు.
    మనం ఎప్పుడు దెషానికి ఎమి చెసెమొ ఆలొచించము. అది ఆలొచిస్థె గాని ఈ దెషము బాగుపడదు. కవి గారు ఈ దెషనికి ఎందుకు పనికి ఉపయొగం లెని కవితలు కంటె మీ కొంట్రిబ్యుషన్ ఎమిటి. కవితలు రాయండి. కాని దానితొ పాతు దెషానికి ఎమైన చెయండి. ఈ కవితలు చదివిన బాబులు, చదివి అభిప్రాయాలు ఇచ్చిన బాబులు మీరందరు కూడా ఆలొచించండి. మీరు దెషానికి ఎమి చెసెరని.

    ప్రతి చోటు లోను కొన్ని మంచి కొన్ని చెడు ఉంటాయి. చెడు లో మంచిని చూద్దము. ఆ మంచితొ చెడుని నషిద్దము.

    జై హింద్

  7. Rajani 11 మే 2007 , 7:15 am

    స్రవంతి గారూ మీరు మరి అంత ఘాటుగా విమర్సించనక్కర్లేదు. యెవరి అభిప్రాయము వాల్లు చెప్పారు. కవిత బవుంది కాని మువ్వెన్నల జండ పడగ అనడం బలేదు. మన దేశం యెంత మంది శరనార్ధులకు ఆశ్రయము ఇచ్చిందొ తెలుసా? మన దేశం శాంతికి చిహ్నం. పుట్టిన దేశాన్ని గౌరవించని యే రచయితలోనూ యెటువంటి గొప్పతనమూ లేదు.

  8. aari sitaaraamayya 14 మే 2007 , 3:29 pm

    నిర్మల గారూ, నమస్కారం.

    మీ కవిత చాలాబాగుంది.
    చచ్చిగాని నిరూపించుకోలేని పౌరసత్వం…
    కలకాలం కాపురముంటున్న కన్నీటి బిందువు…
    ఏ తల్లి కడుపులోంచో ఇంకాపుట్టని వితంతు స్వరం…
    చక్కగా రాశారు.

    ఈ మధ్యనే మీ “వానా-బురదా” చదివాను.
    ఇప్పుడు ఈ కవిత. ఇలాగే మీరు మంచి కవితలు రాస్తూ ఉంటారని ఆశిస్తూ,
    -ఆరి సీతారామయ్య

  9. umamaheswara rao c 14 జూన్ 2007 , 2:22 pm

    Nirmala garu,this is one of the best pieces i have ever read.When Bertrand Russell speaks against the war , the so called patriots of British empire naturally imprison him.When Arudra writes against patritism,the literary piece will not get published.Added up here, in our India that is called Bharath, is another menace.Our superHindu patriots like BalThakre demand our fellow citizens, who are signatories of this country’s constitution, to prove their loyalties.What a paradox!
    So if you speak about the tears against the demands of this ‘majority’ or if you will not admit that all is shining under our flag, it is natural you willbe condemned for not speaking their language ‘patriotism’.I will be more happy if you get more letters against you because of the hearts of the educated traditionalists are throbbing with patritism, America and net.So I request you to produce more pieces of compassion like this but not to explain.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)