1931 మార్చి23 వ తేదిన లాహోర్ సెంట్రల్ జైలులో ఉరితీయబడ్డ భగత్ సింగ్ శతజయంతిని ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ నేపధ్యంలో భగత్ సింగ్ రాజకీయ భావజాలాన్నీ, ఆచరణనూ విశ్లేషిస్తూ ఆయన మిలింటెంటు జాతీయవాద పంధాను అనుసరించడానికి గల కారణాలను చరిత్రకారుడు వి. ఎన్. దత్తా అన్వేషిస్తాడు.

ఇరవైయవ శతాబ్దపు ఆరంభంలో భారతదేశ స్వాతంత్రం కోసం రెండు పంధాలు అనుసరించారు. ఒకటి రాజ్యాంగబద్ధమైనది. బి. జి. గోఖలే వర్గం భారతదేశానికి ‘స్వయం పరిపాలన’ సాధించాలనే లక్ష్యంతో పనిచేసారు. రెండవది బ్రిటిషు ప్రభుత్వాన్ని స్తంభించాలనే ఉద్దేశంతో మహాత్మాగాంధీ ముందుకు తెచ్చిన ‘సహాయనిరాకరణాద్యోమం’. ఈ రెండు పంధాలు భగత్ సింగ్ ను ఆకట్టుకోలేక పోయాయి.

భగత్ సింగ్ రాజకీయభావజాలం పైన కానీ, 1931 మార్చి 23 వతేదిన లో ఆయనను ఉరితీయడానికి దారితీసిన అప్పటి పరిస్థితులపైన కానీ పెద్దగా పరిశోధన జరగలేదు. అంటే పరిశోధనకి కావలసిన వనరులు, సామాగ్రి లేక కాదు. చాలామంది చరిత్రకారులు భగత్ సింగ్ ఎంచుకున్న మార్గానికి దారితీసిన అప్పటి సామాజిక పరిస్థితులనూ, సంఘర్షణలనూ అర్థంచేసుకోకుండా కొన్ని బాహ్య విషయాలపైనా సంచలనాత్మకమైన సంఘటనలపైనా దృష్టిపెట్టారు.

bhagathsingh03.jpg

పంజాబ్ రాజకీయంగా ఉద్రిక్తంగా వున్నకాలంలో, 1907 సంవత్సరంలో భగత్ సింగ్ జన్మించాడు. అప్పటి గవర్నర్ డెంజిల్ ఇబెట్సన్ “పంజాబ్ లో కొత్త గాలి వీస్తుంది” అని రాసాడు. రైతులలో అలజడి రేపుతున్నారనే నెపంతో భగత్ సింగ్ బాబాయి అజిత్ సింగ్నూ, లాలాలజపతి రాయ్నీ మాండలే కు బహిష్కరించారు. బ్రిటిషు ప్రభుత్వం 1818 నల్లచట్టాలను ప్రయోగించింది. అజిత్ సింగ్, లాలాలజపతిరాయ్ పంజాబ్ లో రైతుల భూస్వామ్యుల మద్దత్తును కూడగడుతూ, వలసవాద నల్లచట్టాలను రద్దుచేయాలని ఉద్యమం లేవదీసారు.

బ్రిటిషువాళ్ళు తిరుగుబాటు భావాలకు కేంద్రంగా భావించే లాహోరు లోని డి.ఏ.వి హైస్కూల్ లో భగత్ సింగ్ చేరాడు. చిన్నప్పుడే భగత్ సింగ్ మానసికంగా బాగా పరిణితి చెందాడు, కానీ చదువులో అంత గొప్ప ఏమీకాదు. పుస్తకాలు బాగా చదివాడు. కానీ స్థిరత్వం వుండేదికాదు. కీర్తి పత్రికలో ప్రచురించిన రచనలప్రకారం మదనలాల్ ఢింగ్రీ విప్లవపోరాటాలూ, భాయ్ పరమానంద్ దేశభక్తి భావాలూ, మరియు ఉరితీయబడ్డ భాయ్ ముకుంద్ల ప్రభావం భగత్ సింగ్ మీద బాగా వుండేవి. నిబద్ధతతో, పోరాటస్పూర్తితో గదర్ పార్టీ నాయకులు పంజాబ్ ను విప్లవపోరాటలకు భూమిక చేసారని భగత్ సింగ్ చెప్పేవాడు. ఆరోజులలో పంజాబ్ లోని ఉద్యమానికి కర్తార్ సింగ్ సరభా ముఖ్యనాయకుడు, విప్లవోద్యమానికి నాయకులైన రాస్ బిహారీబోస్ మరియు ఎన్. జి. పింగ్లే నాయకత్వంలో పనిచేసేవాడు.

పదకొండు సంవత్సరాల వయస్సులోనే భగత్ సింగ్ ఏఫ్రిల్ 13, 1919 న జరిగిన జలియన్ వాలాబాగ్ హత్యాకాండనూ, ‘మార్షల్ లా’ నల్లచట్టాల దురాగతాలనూ చూసాడు. పంజాబ్ లో జరిగిన “తప్పులు” మరియు ఖిలాఫత్ అంశాన్ని సమ్మేళించి, గాంధీ సహాయనిరాకరణోద్యమాన్ని ప్రారంభించి దేశాన్ని చైతన్యపరిచాడు. భగత్ సింగ్ రాజకీయాలు అతని జీవితారంభంలో తెలుసుకోవడం కష్టమే, కానీ 1920 నుండి చాలా స్పష్టంగా అర్థమవుతాయి. సహాయనిరాకరణోద్యమం కాలంలో భగత్ సింగ్ బ్రిటిషుపాలనను నిరసిస్తూ లాలాలజపతి రాయ్ ప్రారంభించిన “నేషనల్ కాలేజీ” లో చేరాడు. గురు కా బాగ్ లో అకాలీలు జరిపిన ఊరేగింపులో కూడా పాల్గొన్నాడు.

1922 ఫిబ్రవరి 5 తేదిన చౌరీచౌరా సంఘటనలో కొంతమంది పోలీసులు మరణించటంతో గాంధీ సహానిరాకరణోద్యమాన్ని ఆపేశాడు. 1922 -24 కాలంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పంజాబ్ లో చెలరేగిన మతకల్లోలాల వల్ల హిందూ -ముస్లిం సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. దేశం రాజకీయంగా చాలా బలహీనంగావున్న కాలమది. రాజ్యాంగపరమైన విభేదాలతో కాంగ్రెసు, ముస్లింలీగ్ , పంజాబ్ యూనియన్ పార్టీల మధ్య చీలికలు వచ్చాయి. గాంధీ మొదలుపెట్టిన సహానిరాకరణోద్యమం కుప్పకూలిపోవటం, దేశంలో మతకల్లోలాలు చెలరేగటం భగత్ సింగ్ కళ్ళారా చూసాడు. రాజ్యాంగపరమైన విభేదాలతో, కుమ్ములాటలతో వైఫల్యం చెందుతున్న రాజకీయపార్టీలను చూసాడు. స్వాతంత్రం కోసం రాజకీయపార్టీలు అవలంభిస్తున్న మార్గాలతో, వాటి వైఫల్యాలతో విసిగిపోయాడు.

మార్క్సిజం ప్రేరణతో విప్లవపోరాటంతోనే భారతదేశంలో బ్రిటిషు దురాక్రమణను అంతం చేయవచ్చని భగత్ సింగ్ భావించాడు. 1923 లో “హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ “ లో చేరాడు. విద్యార్ధులలో విప్లవభావాలు వ్యాప్తిచేయడానికి 1926 మార్చి లో లాహోర్ లో “నౌజవాన్ భారత్ సభ”ను స్థాపించాడు. పంజాబ్ బెంగాల్ లలో విప్లవపార్టీ నిర్మాణం చేస్తూ సోషలిజానికి చేరువయ్యాడు. భగత్ సింగ్ రాజకీయ కార్యాచరణకు సోషలిస్టు భావజాలం సైద్ధాంతిక పునాదివేసింది.

“బ్లాక్ ఫ్లాగ్ మార్చ్“ నిరసన ప్రదర్శనలో లాలాలజపతి రాయ్ పై లాటీచార్జీ చేసిన స్కాట్ అనే పోలీసు అధికారిని భగత్ సింగ్ అంతమొందిద్దామనుకున్నాడు. భగత్, సుఖదేవ్, చంద్రశేఖర్ అజాద్లు పొరపాటున స్కాట్కి బదులుగా సాండర్స్ అనే పోలీసు హెడ్ కానిస్టేబుల్ ను అంతం చేసారు. 1929 ఏఫ్రిల్ 8 వ తేదీన భగత్ సింగ్ , బి.కే దత్ కలిసి సెంట్రల్ లేజిస్లేటివ్ అసెంబ్లీ లో బాంబులువేసి బ్రిటిషు దురాక్రమణదారుల కపటనాటకాలనూ ‘స్వయంపరిపాలన’ ఇస్తామనే బూటకపు వాగ్దానాలనూ బట్టబయలుచేసారు. “ఇంక్విలాబ్ జిందాబాద్” అని నినాదాలిస్తూ స్వయంగా అరెస్టు అయ్యారు. తర్వాత భగత్ సింగ్ , రాజగురు, సుఖదేవ్ లను బ్రిటిషు దురాక్రమణదారులు లాహోర్ జైలులో 1931 మార్చి 23 వతేదిన ఉరితీసారు.

bhagat_singh_in_jail.jpg

భగత్ సింగ్ గాంధీ మార్గాన్ని తిరస్కరించాడు. మరి భగత్ సింగ్ పైన, ఆయన చర్యలపైన గాంధీ, కాంగ్రెసు నాయకుల అలోచనలు ఎలావున్నాయి? అప్పటి కాంగ్రెసు అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ లాహోరులోని సెంట్రల్, బోరస్టాల్ జైళ్ళను 1929 లో సందర్శించి భగత్ సింగ్ నూ అతని అనుచరులను కలిసారు. వారి దేశభక్తికీ, నిబద్ధతకూ ముగ్ధుడై వారిని “జాతీయ వీరులు” అని నెహ్రూ పేర్కొన్నాడు. భగత్ సింగ్ మేధస్సును చూసి అబ్బురపడ్డాడు. నెహ్రూ తన ఆత్మకథలో వారి సాహసానికీ దేశభక్తికీ శ్రద్ధాంజలి ఘటించాడు. కానీ కాంగ్రెసు పార్టీ భగత్ సింగ్ పైన విధాన నిర్ణయం తీసుకొనే సమయంలో మటుకు నెహ్రూ మాటమార్చి తప్పిదం చేసాడు. 1931 లో జరిగిన కరాచీ కాంగ్రెసు సభలో నెహ్రూ మాట్లాడుతూ “భగత్ సింగ్ మార్గంలో వెళ్ళవద్దు, ఎందుకంటే అది దేశాన్ని నాశనం చేస్తుంది” అన్నాడు. ఆయన భగత్ సింగ్ చర్యలను ఆమోదించలేదు….

కొంతమంది విమర్శకులు గాంధీ తలుచుకొనివుంటే భగత్ సింగ్ ప్రాణాన్ని కాపాడగలిగేవాడు, కానీ ఆయన ప్రయత్నించ లేదంటారు. ఆయన ‘గాంధీ - ఇర్విన్’ ఒప్పందంలో భగత్ సింగ్ ను కాపాడలనే ప్రతిపాదన పెట్టలేదు. వైస్రాయి ఇర్విన్ తో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలలో మటుకు భగత్ సింగ్ ఉరిశిక్షను రద్దుచేయాలనీ, ఉరిశిక్ష దుర్మార్గమనీ పేర్కొన్నాడు. గాంధీ, ఇర్విన్ల మధ్య ఏదో రహస్య అవగాహన వున్నదనీ దానిప్రకారం ఒప్పందాన్ని ఆమోదిస్తూ కాంగ్రెసు తీర్మానం చేసిన తర్వాత ఉరిశిక్షను రద్దుచేస్తారనీ ఊహాగానాలుండేవి. దీనికి ఆధారాలు లేవు. లార్డు హాలీఫాక్స్ గా పేరు మార్చుకున్న ఇర్విన్ ఆత్మకథలో ఎక్కడా ‘రహస్య అవగాహన’ ప్రస్తావనే లేదు. దానితో ఊహాగానాలకు తెరబడుతోంది.

5 అభిప్రాయాలు

  1. kirankumar 16 ఆగస్టు 2007 , 2:46 am

    మీ వ్యాసం చాలా బాగుగాఉంది. మాలాంటి విద్యార్ధులకు తెలియని చాలా విషయాలు మాకు తెల్పుతున్నందుకు మీకు ధన్యవాధాలు. అలాగే నాకు బుద్ధుని శిష్యురాలు అయిన ఆమ్రపాలి గురించిన వివరాలు కావలెను మీకు నాకు హెల్పు చేయాలని ఉంటే దయౌంచి తెలుపగలరు మీ సమాధానం కొరకు నేను వేచి ఉంటాను

  2. koresh 31 మార్చ్ 2008 , 1:40 pm

    శా0తి కి అశా0తి కీ ఆమడ దూర0, గా0ధీ విప్లవ వీరులను సపొర్తు ఎలా చెస్థ్రు

  3. mastanayya 31 మార్చ్ 2008 , 3:25 pm

    1917 లో జరిగిన బోల్షెవిక్ విప్లవం అన్ని వలస దేశాలపై ఒక ప్రభావం పడవేసింది. పాలక వర్గాన్ని విప్లవం ద్వారా కూల్చవచ్చునన్న వాస్తవాన్ని బహిర్గతం చేసింది. చౌరీ చౌరా సంఘటన ఆ పరిణామాల్లో ఒక అంతర్భాగం. ఈ పరిణామాలకు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కొంత జడిసారు. భారత జాతీయోద్యమంలో గాంధీ ఒక నాయకుడిగా ఎదగటం, భగత్ సింగ్ ఉరితీయబడటం, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కుతంత్రంలో అంతర్భాగం.
    భారత లెనిన్, భగత్ సింగ్ హత్యలో గాంధీ ఒక దోషి–అన్న వాస్తవం వర్గ విశ్లేషణ ద్వారా బయల్పడుతుంది, ఉత్తరాలు పరిశీలించటం ద్వారా కాదు. భగత్ సింగ్ కు విప్లవ జోహార్లు.

  4. mastanayya 31 మార్చ్ 2008 , 3:30 pm

    ఆలూరి భుజంగ రావుగారు తెలుగులోకి భారత విప్లవ వీరులకి సంబంధించిన పుస్తకాల్ని హిందీ నుండి అనువదించేరు. అందులో “సింహావలోకనం” మంచి పుస్తకం. భగత్, ఇతర విప్లవ వీరులకు సంబంధించిన చాలా విషయాలు తెలుస్తాయి.

  5. vamshi 10 ఏప్రిల్ 2008 , 10:11 pm

    ప్రతి కాలానికి ఒక ధర్మం ఉంటుంది. పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉండాలి. దేశం కుల, మత, జాతి లతొ విడిపొవడం గాంధీ తప్పని ఒప్పుకోవలసి ఉంటుంది మరి.

    గాంధీ ఆత్మ గౌరవం ఎలాంటిది. అతను దానిని తాకట్టు పెట్టాడని నాకు అనిపిస్తుంది. దేశ విభజన కాలం నాటి వైఫల్యం ఎవరి నెత్తిన రుద్దుతారు మరి.. భారత సైన్యం బ్రిటిష్ వారికి ఎందుకు సపోర్ట్ చేసింది. అక్కడ హింస లేదా… వ్యూహాలు లేకుండా గుడ్డి అహింస ఈరోజు మన కొంపలు ముంచుతుంది. భవిష్యత్ తరాలు గంగలో కలిసే అహింస ఎందుకు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)