నందిగ్రామ్ రైతులుపై సిపిఎం, కాంగ్రెసు ప్రభుత్వాల మారణకాండను ఖండించండి!
మానవ హక్కులు, ప్రజాస్వామిక విలువలను కాపాడండి!
పశ్చిమబెంగాల్ రాష్ట్రం నందిగ్రామ్ గ్రామంలో సిపిఎం సర్కారు పేద రైతులనుండి వేలాది ఎకరాల వ్యవసాయ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకొని ఇండోనేషియాకు చెందిన ‘సలీం గ్రూప్’ అనే ప్రెవేటుకంపెనీకి ఉచితంగా ఇస్తోంది. రైతుల, రైతుకూలీల జీవనోపాధి పైన దాడిచేస్తోంది. పచ్చని పచ్చని పొలాల మధ్య కాలుష్యాన్ని విరజిమ్మే కెమికల్ ప్యాక్టరీని ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది. జీవనోపాధిని కొల్లగొట్టే ప్రభుత్వవిధానాలను నిరసిస్తూ నందిగ్రామ్ రైతులు ఉద్యమిస్తున్నారు.
మార్చి 14 వతేదిన సిపిఎం ప్రభుత్వ నాయకత్వంలో 5000 సాయుధపోలీసులు, సిపిఎం పార్టీ కార్యకర్తలు దాడిచేసి, పద్నాలుగు మంది రైతులను నిర్ద్యాక్షణ్యంగా కాల్చి చంపారు. దాడిచేస్తున్న పోలీసులను నందిగ్రామ్ ప్రజలు అడ్డుకొని వీరోచితంగా ప్రతిఘటించారు. స్త్రీలు, పిల్లలు మానవ వలయంగా నిలబడి పోలీసుదాడి నుండి తమ గ్రామాన్ని రక్షించుకోవటానికి ప్రయత్నించారు. నందిగ్రామ్ ప్రజలు రక్తాన్ని చిందించి, ప్రాణాలు అర్పించి తమ త్యాగాలతో ఉద్యమపధాన నిలచారు.
ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, ప్రపంచబ్యాంకు విధానాలకు, బహుళజాతి కంపెనీల దుర్మార్గపు ప్రయోగాలకు రైతులు, రైతుకూలీలు బలి అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కేంద్రంలోని కాంగ్రెసు సర్కార్లు, పశ్చిమబెంగాల్ లోని సిపిఎం సర్కారు పేద రైతులనుండి వేలాది ఎకరాల వ్యవసాయభూమిని బలవంతంగా లాక్కొని కోటీశ్వరులకు పాదాక్రాంతం చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు అడుగులకు మడుగులొత్తుతున్నాయి కాంగ్రెసు, సిపియం ప్రభుత్వాలు.
ఇంతకుముందే ప్రభుత్వం 250 స్పెషన్ ఎకానమిక్ జోన్లకు ( Special Economic Zones ) అనుమతించింది. మరో 180 వరకు అనుమతివ్వటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. తాజాలెక్కల ప్రకారం, దేశవ్యాపంగా 500 స్పెషన్ ఎకానమిక్ జోన్లలో 8 లక్షల ఎకరాలను పాదాక్రాంతం చేస్తోంది. గతంలోని బిజెపీ, తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా ఇవే విధానాలను అమలుచేసాయి.
సామాజిక బాధ్యత గలిగిన రచయితలు, రచయిత్రులు, కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు, ప్రజాస్వామిక వాదులుగా మేం సిపిఎం, కాంగ్రెసు ప్రభుత్వాల హత్యాకాండను ఖండిస్తున్నాం. భూమి దున్నే రైతుకి, రైతు కూలీలకే భూమి చెందాలని డిమాండు చేస్తున్నాం. ప్రపంచబ్యాంకు మరియు సిపిఎం, కాంగ్రెసు ప్రభుత్వాలు రైతుల హత్యలను, మానవహక్కుల ఉల్లంఘనను ఆపివేసి ప్రజాస్వామిక విలువలను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామికవాదులందరూ ఈ దుర్మార్గాన్ని ఖండించవలసినదిగా విన్నపం చేస్తున్నాం.
Nandigram Addendum:
http://prajakala.org/PDF/Nandigram_addendum.pdf
ఆరి సీతారామయ్య - కథా రచయిత
ఎండ్లూరి సుధాకర్ - దళిత కవి
కళ్యాణరావు - విప్లవ రచయిత, విప్లవ రచయితల సంఘం (విరసం)
వేలూరి వేంకటేశ్వర రావు
డా. దార్ల వెంకటేశ్వరరావు - రచయిత, హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ ఉపన్యాసకులు
పి. సత్యవతి – కథా రచయిత
వరవరరావు - విప్లవకవి, రచయిత, విప్లవ రచయితల సంఘం (విరసం)
హెచ్చార్కె – హనుమంత రెడ్డి. కె , కవి
సి. శ్రీనివాస్ - న్యూయార్క్
ఎన్. వేణుగోపాల్ - వీక్షణం పత్రిక సంపాదకులు, రచయిత
వాసిరెడ్డి నవీన్ - కథ సంకలనం, సంపాదకులు
జాన్ హైడ్ కనుమూరి
శ్రీధర్ దేశ్ పాండే - తెలంగాణ రచయితల వేదిక
గీతాంజలి - విరసం
నారాయణస్వామీ – కవి
గాంధీ
మమత
ప్రశాంత్
సాజీగోపాల్
నందిగ్రామ్ రైతుల పై సిపిఎం, కాంగ్రెసు ప్రభుత్వాల మారణకాండను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇతర రాష్ట్రాలలో ప్రపంచ బ్యాంకు విధానాలను ను తీవ్రంగా వ్యతిరేకించే సి.పి.యం. ప.బెం.లో మాత్రం ఫక్తు బూర్జువా పార్టీగా ఎందుకు రూపాంతరం చెందుతుందో వారే సమాధానం చెప్పాలి. మొత్తానికి సామాన్య ప్రజలు, రైతుకూలీలపై అధికారిక మారణ కాండ జరపడంలో ఎర్రజెండాలు మరేఇతర బూర్జువా పార్టీకి అతీతం కాదని రుజువైంది..
ఖాజా, కవి, సామాజిక కార్యకర్త.
సి.పి.ఎం నాయకులు సీతారామ్ ఏచూరి, రాఘవుల బండారం బయటపడుతోంది. ఆ పార్టీచేసింది తప్పు. రైతుకూలీలను చంపడం చాలా అమానుష్యం. తమ పార్టీ చేసిన హత్యలను ఇతరులమీదకు నెట్టి, చేతులు దులుపుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ సిగ్గులేకుండా చేసిన తప్పుని సమర్ధించు కోవటం ఇంకోతప్పు. ప్రత్యేక ఆర్ధిక మండల్లు ( Special Economy zones) వున్నాయని, లేవని దొంగనాటకాలు ఆడటం. సి.పి.ఎం, సి.పి.ఐ లాంటి రివిజనిస్టు పార్టీలకు ప్రజా ఉద్యమాలపట్ల, సిద్ధాంతాలపైన నిబద్ధత వుండదు. “నాలుగు ఓట్లకోసం రెండు సీట్లకోసం” వెంపర్లాడటం మాత్రం తెలుసు. ఈ పాపంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, అమెరికన్ ఏజెంటు ప్రపంచబ్యాంకులు కూడా భాగస్తులే. ప్రపంచీకరణ పేరు తో మనభూమి, మన నీరులకు ఎసరు పెడుతున్నారు. రైతుల కూలీలపై ముప్పేట దాడి చేస్తున్నారు. “కోట్లాది మందిని కొల్లగొట్టి కోటిశ్వరులను మేపుతున్నారు”.
- మహేష్
నందిగ్రామ రైతుల మీద జరిగిన దాడి చాలా హేయం.వామపక్ష పార్టిలు కూడా ప్రజా వ్యతిరేక చర్యలు చేపడితే ఎంత సిగ్గు.
రచయిత(త్రు)ల అభిప్రాయలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.ప్రపంచీకరణ గురించి మాట్లాడే హక్కు సి.పి.యం కోల్పోయింది.
కరుణాకర్
ప్రజకల చాలబాగుంది మీ ప్రయత్నము అబినందనీయము.తెలుగు సాహిత్యములొ ఇది వినుత్నప్రయొగము.
ఒకసారి సింగూర్,ఒకసారి నందిగ్రాం, ఒకసారి మిడ్నాపూర్. ఈ తమాషా ఆగేట్టు లేదు. ప్రోలిటేరియేట్లనే పీడించే పాలకులను ఖండిద్దాం. కవులుగా పెన్నులు విదిలిద్దాం. తుల్లిమల్లి విల్సన్ సుధాకర్.
ఒకసారి సింగూర్,ఒకసారి నందిగ్రాం, ఒకసారి మిడ్నాపూర్. ఈ తమాషా ఆగేట్టు లేదు. ప్రోలిటేరియేట్లనే పీడించే పాలకులను ఖండిద్దాం. కవులుగా పెన్నులు విదిలిద్దాం.
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్.