
మానవుడు ఉన్నతత్వం సాధించే పరిణామాన్ని వర్ణించిన నవల మాక్సిమ్ గోర్కీ ‘అమ్మ’ నవల అని ప్రజా సాహితి ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు అన్నారు . 09 - 03 - 2007 సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు లో జరిగిన సమావేశంలో ‘అమ్మ’ నవలపై ప్రత్యేక సంచికను ఆవిష్కరించి ముఖ్య వక్తగా ఆయన మాట్లాడారు . వ్యష్టి నుండి సమష్టికి పయనించటమే ‘అమ్మ’ నవల ధ్యేయం అని చెప్పారు.
గోర్కీ బాల్యమే ఒక నవల వంటిదని చెప్తూ ఆయన జీవిత సంగ్రహాన్ని వివరించారు . సమాజంలో ఉన్న ‘చేదు’ ని బయటపెడ్తానని తన పేరును గోర్కీ అని మార్చుకున్నాడని ఆయన చెప్పారు. అమ్మ నవల తెలుగులో గోపీచంద్, రావిశాస్త్రి తదితర రచయితలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందనీ, ఆ ప్రభావం వాళ్ళ రచనల్లో కనిపిస్తుందనీ వివరించారు . ‘అమ్మ’ నవలలో- సామ్యవాద వాస్తవికత, మార్కిస్ట్ మౌలిక సూత్రాలను రచయిత చక్కగా సామాన్యునికి కూడా అర్థమయ్యేటట్లు సృజనీకరించారని సోదాహరణంగా వివరించారు .నిజానికి ‘అమ్మ’ నవల నేటికీ సాహిత్యంలో బ్రతికే ఉందనీ కానీ , సామాజిక పోరాటాల్లో దాని ప్రభావం సాహిత్యంలో కనిపించినంతగా లేదనీ ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దాని అవసరం ప్రపంచ వ్యాప్తంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు . ‘ఆమ్మ’ నవలలో ఆయన చెప్పిన మార్క్సిస్ట్ సూత్రాల , సామ్యవాద వాస్తవికతలను సమన్వయించిన తీరు విద్యార్థులను బాగా ఆకట్టుకుంది .
కార్యక్రమంలో ముందుగా “జనసాహితి ” నగర శాఖ అధ్యక్షులు డా. లక్ష్మీనారాయణ భట్టు మాట్లాడుతూ జనసాహితి నివేదికను సమర్పించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచయిత కళాకారుడు ప్రజల పక్షాన ఉండాలని, కళ ప్రజల కోసమే అనే దృక్పథంతో రచనలు చేసిన ప్రముఖుడు మాక్సిమ్ గోర్కీ అని ప్రశంసించారు. నవల లోని కొన్నిసన్నివేశాలని వివరిస్తూ సమకాలీన సమస్యల పోరాటానికి అమ్మ నవల ఉపయోగపడుతుందని అన్నారు .
అంతకుముందు డా. కె. సునంద ‘ఆమ్మ’ నవలలోని ఇతివృత్తాన్ని వివరించారు. నవల చదవని వారికి నవల చదివినంత స్ఫూర్తిని కలిగిస్తూ కథను వినిపించారు. సభకు డా . పిల్లలమర్రి రాములు అధ్యక్షత వహిస్తూ సమస్యల పరిష్కారానికి పలాయనవాదం పనికిరాదని , పోరాటంతో వాటిని ఎదుర్కోవాలని ఉద్బోధించారు.’ ఆమ్మ’ నవలలో కళా విలువల గురించి డా. దార్ల వెంకటేశ్వరరావు ప్రసంగించారు . ఆచార్య హరగోపాల్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. జిలుకర శ్రీనివాస్ తన స్పందనను తెలియజేసారు.